20, నవంబర్ 2008, గురువారం

దిక్కార వ్సరాలుగా ఆఫ్రికా కవులు గుర్రం సీతారాములు

ప్రపంచ వ్యాప్తంగా రచయితలు తమ తమ దేశాల్లో ఏం జరుగుతుందో రాయాలనుకుంటారనేది నిజం. అయితే ఆధునిక ప్రపంచం గురించి విపరీతమైన విషయం ఏమిటంటే తాము పుట్టిన దేశంలో ఏమి జరుగుతుందో వ్యాఖ్యానించడానికి ఎంతో మంది రచయితలు ఇంకొక దేశానికి వలస పోవలసి వచ్చింది. ఈ విషాదం మనం ఆఫ్రికా దేశాలలో చూస్తాం. ఆ క్రమంలో ఆ విషకోరల్లో ఎంతో మంది ఆఫ్రికా కవులు తమ ప్రాణాలను అర్పించారు. మరికొంత మంది దేశ బహిష్కారానికి గురైనారు.21వ శతాబ్దంలోనికి దూసుకుపోతున్న ప్రపంచ సాహిత్యంలో రష్యా, చైనాల తర్వాత గొప్ప సాహిత్యం నేడు ఆఫ్రికా ఖండంలోని చాలా దేశాలలోనూ మరియు లాటిన్‌ అమెరికా దేశాల నుండీ వెలువడుతోంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మట్టికాళ్ళ మహారాక్షసిలా పట్టిపీడిస్తూ విశృంఖలంగా వ్యాపిస్తున్న నయావలస విధానం, గ్లోబలైజేషన్‌ మూడవ ప్రపంచ దేశాలను నేడు ఒక తెగులుగా పట్టి పీడిస్తున్నాయి. ఆ క్రమంలో ఆయా దేశాల నుండి వెలువడుతున్న సాహిత్యం నేడు తెలుగు పాఠకులకు అంతంత మాత్రమే అందుబాటులో వుంది.”రాజకీయాలు తెచ్చే మార్పులకన్నా సాహిత్యం తెచ్చే మార్పులు లోతైనవీ దీర్ఘకాలం నిలబడేవి” అన్నాడు మారియో వెర్గాస్‌ ల్లోసా.సాహిత్యోద్యమాన్ని ఒక సామాజిక బాధ్యతాయుత కర్తవ్యంగా స్వీకరించి, కాలం చెల్లినా కొనసాగుతున్న కుళ్ళి కంపుకొడుతున్న భూస్వామ్య సంస్కృతిని అంతం చేసే లక్ష్యంతో సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తించి దాన్ని నిరంతరం కాపాడుకుంటూ, భారత సమాజంలో వివిధ చారిత్రక దశల్లో వర్గ సంఘర్షణల ఫలితంగా వ్యాప్తిలోకి వచ్చిన ప్రగతిశీల పురోగామిక సాంస్కృతిక భావజాలాన్నీ కళాసాహిత్యాలనూ ‘జనసాహితి’ తన వారసత్వంగా స్వీకరించింది. అనువాద సాహిత్య సృజన పట్ల ఎంతో శ్రద్ధ వహించి ‘ఆఫ్రికా స్వేచ్ఛా గానం’ పేరుతో ఓ కాలమ్‌ను నిరంత రాయంగా నడిపిన ఏకైక పత్రిక ‘ప్రజాసాహితి’. ఆ అనువాద కృషిని వివరించే ప్రయత్నమే ఈ వ్యాస ఉద్దేశ్యం.ఆ క్రమంలో వాళ్ళు కెన్‌ సారో వివా, ఒలె సొయింకా, చినువాఅచిబి, గూగీ వా థియాంగో, బ్రేటన్‌ బ్రేటన్‌బా, లియోపాల్డ్‌ సెగార్‌ సింఘార్‌, బెంజిమన్‌ మొలైసీ, పాట్రిస్‌లుముంబా, డెనిస్‌ బ్రూటస్‌, జీన్‌ జోషప్‌, రబి రోవేలా, ఫ్రెడరిక్‌ డగ్లస్‌, సిజైర్‌లాంటి ఎంతో మందిని గూర్చి ఎన్నో విలువైన వ్యాసాలను మరికొంతమంది మీద ప్రత్యేక సంచికలు ‘ప్రజాసాహితి’ తీసుకువచ్చింది. చినువా అచ్‌బీ రాసిన ‘ధింగ్సు ఫాల్‌ ఎపార్ట్‌’ అనే నవలను ‘చెదిరిన సమాజం’ పేరిట తెలుగులోకి అనువాదం చేయించి ప్రజాసాహితిలో ధారావాహికగా ప్రచురించారు. దీనినే జనసాహితి ప్రచురనగా వెలువరించారు. ఆయా సంచికల్లో చర్చించిన ఆఫ్రికన్‌ సాహిత్యం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.”సంక్షోభ సమయాల్లో సాహిత్యాన్ని రాజకీయాల నుండి విడదీయకూడదు. నిజానికి సాహిత్యం రాజకీయాలలో నిలబడి జోక్యం చేసుకొని సమాజానికి ఉపయోగపడాలి. రచయితలు కేవలం సంతోషపెట్టడానికో గందరగోళంలో ఉన్న సమాజాన్ని విమర్శనాత్మకంగా చూడడానికో రచనలు చేయకూడదు” అని నైజీరియన్‌ రచయితా, ఒగోని ప్రజలనేతా అయిన కెన్‌ సారో వివా వెలిబుచ్చారు. నైజీరియాకు చెందిన కెన్‌ సారో వివా ఇబదానె యూనివర్శిటీలో ఫ్రభుత్వ స్కాలర్‌షిప్‌తో చదివాడు. రివర్స్‌ రాష్ట్రంలో 1941 అక్టోబర్‌ 1న జన్మించిన కెన్‌ సారో వివా, అత్యంత ఫ్రతిభావంతమైన విధ్యార్థి, గొప్ప జాతీయవాది, మహా మేధావి. విశ్వవిద్యాలయ అధ్యాపకుడిగా ఒగోని ప్రజల స్వయంనిర్ణయాధికారం కోసం హక్కుల కోసం ఉద్యమించాడు. 1970వ దశకంలో గొప్ప సృజనాత్మక రచనలు చేశాడు. వలస పాలనకు వ్యతిరేకంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సామ్రాజ్యవాదానికీ, బహుళజాతి సంస్థ అయిన ‘షెల్‌’ కంపెనీ సాగిస్తున్న పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా సమర్ధవంతమైన ప్రజా పోరాటాలను సమీకరించిన వాడు కెన్‌సారో వివా.1994 మే నెలలో అక్రమంగా అతనితోబాటు 13 మంది ఉద్యమకారులపై హత్యానేరారోపణ చేసి జైల్లో చిత్రహింసల పాలు చేసింది సామ్రాజ్యవాద ప్రపంచ కనుసన్నలలో పనిచేస్తున్న నైజీరియా ప్రభుత్వం. హత్యానేరం తర్వాత ప్రాసిక్యూషన్‌ జరుగుతున్న సమయంలో ఉరిశిక్ష ఖాయం అని తెలిసిన తర్వాత విలేకరులు ఆయన్ను ఇంటర్‌ర్వ్యూ చేస్తున్నప్పుడు మీ సమాధి మీద ఉండే శిలాఫలకం మీద ఏమి వ్రాస్తే బాగుంటుందనుకుంటున్నారని అడగా -”నైజీరియా పాలకుల చేత మోసపోయిన మర్యాదస్తుడు ఇక్కడ శాశ్వత నిద్రపోతున్నాడు. వారు ఆయనకు ఆరడుగుల నేలను కూడా తిరస్కరించారు” అని వ్రాయమన్నాడు.కెన్‌ సారో వివా జీవితమూ, పోరాటమూ ఇచ్చిన స్ఫూర్తితో నైజీరియా ప్రజలు ఉద్యమిస్తున్నారు. ప్రతి నియంత తాను శాశ్వత మనుకుంటాడు కానీ, ఏ నియంతా శాశ్వతం కాడు. ప్రజలు మాత్రమే సత్యమూ, శాశ్వతమూ. వారి ఉద్యమం ఉద్భవింపజేసిన కెన్‌ సారో వివా వంటి అద్భుత వీరుల్ని బలిగొన్న నియంతృత్వాన్ని వారు తప్పక మట్టి కరిపిస్తారు.ఆఫ్రికాలో ఫ్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా వచ్చిన సాహిత్యాన్ని, సాహిత్యకారుల్ని, వారి విజయాల్ని తుడిచివేయడానికి ప్రభుత్వం మూర్ఖమైన నిర్ణయం తీసుకుంది. 1966లో ప్రభుత్వ గెజిట్‌ 46గురు ప్రవాసులను చట్టప్రకారం కమ్యూనిస్టులని ముద్రవేసింది. వారిలో పీటర్‌ అబ్రహమ్స్‌, మ్ఫాలేలే, మాడిసేన్‌, థాంబా, మైమానే లాగుమా మొదలైనవారి రచనలను దక్షిణ ఆఫ్రికాలో చదవరాదు. కోట్‌ చేయరాదు అని చట్టం చేసింది. అయినా ఆ చట్టాలను ధిక్కరించి అనేక మంది తమ స్వరాల్ని ఎక్కుపెట్టారు.దక్షిణ ఆఫ్రికా కవుల్లో డెనిస్‌ బ్రూటస్‌ ముఖ్యుడు. ఇతన్ని ప్రభుత్వం ఏ రాజకీయ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనకుండా నిషేధించింది. 1962లో అతన్ని ఉద్యోగం నుండి తొలగించారు. 1963లో అరెస్టు చేశారు. జైలు నుండి తప్పించుకొనే ప్రయత్నంలో వెన్నులోంచి తుపాకీ గుండు దూసుకుపోయింది. తర్వాత 18 నెలల కారాగారశిక్ష తర్వాత 1966లో దేశాన్ని వదిలి అమెరికా చేరుకొని అక్కడి నుండి వెలి విధానానికి వ్యతిరేకంగా పోరాటం సాగించాడు.ఇతను చిన్నప్పటి నుండి వర్ణవివక్షను అనుభవించాడు. పోర్ట్‌ ఎయిర్‌ యూనివర్శిటీలో ఉన్నత విద్యను అభ్యసించి ఇతను చాలా కాలం జైలులోనే జీవితం గడిపాడు.ఆ సమయంలో అతని ఉద్వేగాలను కవిత్వీకరించాడు. రాయడానికి కాగితం లేకపోతే టాయిలెట్‌ పేపర్‌ మీద కవిత్వం రాశాడు. కానీ విడుదల అయ్యే ముందు అతని సెల్‌ను తనిఖీ చేసి రాసిన కాగితాలను కాల్చి పారవేశారు.రెండు ప్రపంచ యుద్ధాల మధ్య మెడగాస్కర్‌ లోని ఒక నీగ్రో కవి దీనావస్థకు జీన్‌ జోషఫ్‌ రబెరివేలో జీవితం ఒక ఉదాహరణ. ‘నెగ్రిట్యూడ్‌’ ఉద్యమానికి మూలపురుషుడుగా కీర్తించబడుతున్న రబెరివేలో బాగా చితికిపోయిన ఒక ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ అతను చనిపోయేవరకు అతితక్కువ వేతనం దొరికే ఫ్రూఫ్‌రీడర్‌గానే గడిపాడు.”వలసవాదుల క్రింద ఒకజాతి సంస్కృతి జీవితం ఎలా అణగారిపోతుందో, వ్యక్తి ఏ రకంగా దోపిడీ చేయబడతాడో, పరాయీకరణ పొందుతాడో, జీవన వైఫల్యం వల్ల కలిగే నిరాశ నిస్పృహల్ని రెబరివేలో కవిత్వం అంతర్లీనంగా వ్యక్తీకరిస్తుంది. మెడగాస్కర్‌లో సాహిత్య పునరుజ్జీవనానికి వైతాళికుడయినా అపారమైన ఏకాకితనం, ఓదార్పులేని జీవితం అతన్ని ఆత్మహత్య చేసుకోటానికి దారితీశాయి.”మన బ్రతుకుల్నిండా తగినంతగా నల్లటి మట్టి వుంది/ నల్లటి మట్టిలో నల్లని శరీరాలు ఎర్రని కాంక్షల్తో ఎరుపెక్కుతాయి/ నుదుళ్ళని పాటపుట్టడానికి అనువైన కార్యక్షేత్రంగా తయారుచేసి సిద్ధంగా ఉంచా/ ఉరితీతలో ఎదురుకాల్పులో ఏవైతేనేం? ఇవన్నీ స్వేచ్ఛా సముపార్జన ముందు వెంట్రుక ముక్క” అన్న దక్షిణ ఆఫ్రికా జాతీయకవి పోరాటయోధుడు, స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం పోరాడుతున్న దక్షిణ ఆఫ్రికా నల్లకవి విప్లవకారుడు బెంజిమన్‌ మొలైసీని జాత్యహంకార ప్రభుత్వం దారుణంగా ఉరితీసింది.మాతృదేశ విముక్తికోసం తన కలం అంకితంచేసి స్వేచ్ఛాగానం చేసిన రచయితే దేశాధ్యక్షుడు కావడం చరిత్రలో అరుదైన విషయమే. కవీ, రచయితా, సాహితి సిద్ధాంత కర్త అయిన లియోపాల్డ్‌ సెగార్‌ సింఘార్‌ తన దేశ అధ్యక్షునిగా పనిచేశాడు. ఈయన ప్రపంచపు నాగరికతా విలువలను సమ్మిళితం చేసి ‘నెగ్రిట్యూడ్‌’ అనే పేరును మరో రచయిత అయిమీ సిజైర్‌తో కలిసి సిద్ధాంతీకరించారు. ఆయన ఆఫ్రికాలో గొడ్గూ గోదా కాస్తూ పొలాలవెంట తిరుగుతూ యధేచ్ఛగా గడిపాడు. తొలినాళ్ళలో ఆఫ్రికన్‌ జీవసారమూ, జీవిత విధానమూ అతని రక్తంలో ఇంకిపోయాయి. ఫ్రెంచి భాషా సాహిత్యాలను అధ్యయనంచేసి బోదలేర్‌ మీద పరిశోధన చేశాడు. ఈ దశలోనే కవిగా రాజకీయవాదిగా రూపొందాడు.”ఆఫ్రికన్స్‌కి ఎలా జీవించాలో నేర్పడం ఫ్రెంచి వాళ్ళ ఆలోచనయితే ఆఫ్రికాయే ఫ్రెంచ్‌వాళ్ళకు ఎలా జీవించాలో నేర్పగలద”ని సెంఘార్‌ ధృఢనమ్మకం.”ఆఫ్రికన్‌ సంస్కృతి అనేది దాని మట్టుకు అది పరిమితమైంది కాదనీ, ప్రపంచానికది కొత్త దృక్పథాన్ని ఇవ్వగలిగేదనీ, ఒక విశ్వజననీయ సంస్కృతిని రూపొందించడానికి అది మార్గదర్శకమివ్వగలదని, అది కవిత్వానికి అంతర్లయ” అని నెగ్రిట్యూడ్‌కు ఆయనిచ్చిన నిర్వచనం.”బ్లాక్‌ విక్టిమ్స్‌” అనే పేర ఆయన రాసిన కవితలు అన్ని రకాలుగా అత్యున్నత స్థాయినందుకున్నాయి. తన జీవితపు పునాదులు, క్రిష్టియానిటీలో ఉండటంవల్లనో, పురాతన సంస్కృతిపట్ల మోజు వల్లనో, ఆఫ్రికన్‌ జీవిత విధానంపట్ల తరగని ఆకర్షణ ఉండటంవల్లనో, సెంఘార్‌ ఎప్పుడూ కమ్యునిస్టు కాలేకపోయాడు. మార్క్సిస్టు కాలేకపోయాడు. పైగా మార్క్సిజం యూరోపియన్‌ దేశాలకు వర్తిస్తుందనే గుడ్డినమ్మకం, మార్క్స్‌ సూచించిన వర్గాలు తమ దేశంలో లేవని అపోహ ఆయన్ను మార్క్సిజం వైపు మొగ్గనీయకుండా చేశాయి. ఏది ఏమైనా ఓ వైపు ఊపిరి సలపని రాజకీయాల్లో పాల్గొంటూ తన దేశ ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కాంక్షించి విరామమెరుగక పోరాడుతూ ఆ పోరాటానికి తన కవిత్వాన్ని అంకితం చేసిన ఆఫ్రికన్‌ సహజకవి సెంఘార్‌.ఆఫ్రికా తరచుగా తగులబెట్టబడి, శిధిలపర్చబడి, స్వచ్ఛపరచబడి మంటకు మారుపేరుగా నిలబడుతుందని మాతృభూమి స్వేచ్ఛకొరకు అంతర్మధనపడ్డ ఆఫ్రికా కవి బ్రేటన్‌ బ్రేటన్‌ బా. ప్రజల పోరాటానికి ప్రతీక అయిన డెనిస్‌ బ్రూటస్‌. స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం పోరాడిన బెంజిమన్‌ మొలైసీ, వలసపాలనలో జీవన వైఫల్యాలను పలికించిన జీన్‌ జోషప్‌ రబెరో వెలా లాంటి వాళ్ళు ఎందరో మేధావులు, కవులు, కళాకారులు ఆఫ్రికా సాహిత్య, సాంస్కృతికోద్యమానికి తమ జీవితాలను త్యాగం చేశారు. వారిని గుర్చిన అనేక కవితలు, వ్యాసాలు, ఎంతో విలువైన సమాచారాన్ని అనువదించారు ‘ప్రజాసాహితి’ వారు.”నియంతృత్వం ముందు నిశ్శబ్దంగా ఉండే అందరిలో మనిషి చచ్చిపోతాడని” నినదించిన మరో నల్లజాతి కవి ఒలె సోయింకా. నైజీరియాకు చెందిన ఇతను నోబెల్‌ బహుమతిని అందుకున్న మొదటి నల్లజాతి కవి. 1986న బహుమతి స్వీకరిస్తూ చారిత్రకమైన ఉపన్యాసాన్ని ఇచ్చాడు. దాన్ని నెల్సన్‌ మండేలాకు అంకింతం ఇచ్చాడు.నైజీరియాలో అభికుటి పట్టణంలో మత ప్రచారకుల కుటుంబంలో పుట్టిన ఇతని బాల్యమంతా మత వాతావరణంలోనే గడిచింది. అంతేకాకుండా స్వయంగా రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నాడు. 1965లో నైజీరియా స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్యాయాలు జరిగినా వాటిని ప్రభుత్వం రేడియో ప్రచారం చేయలేదు. అప్పుడు సొయింకా రైఫిల్‌తో రేడియో కేంద్రంలోకి ప్రవేశించి ఎన్నికల్లో అన్యాయాల్ని గూర్చి ప్రసారం చేయమని సిబ్బందిని భయపెట్టాడు. ఆ నేరానికి అతను శిక్ష అనుభవించవలసి వచ్చింది.”ప్రపంచాన్నంతా ”నాగరీకం” చేస్తామనే ‘ఉద్యమానికి’ వారు చూపించిన కారణం తాము తప్ప ఇతరులు నాగరిక మానవులే కాదన్న దృక్పథమే”నంటూ ప్రపంచవ్యాప్తంగా వలసవాదాన్ని ప్రోత్సహించిన నాగరిక దేశాల గుట్టు విప్పారు సొయింకా. ప్రపంచ వ్యాప్తంగా విముక్తి యుద్ధాల వేదన అనుభవించిన మరికొన్ని దేశాల నేల మీద ఇంకా అజ్ఞాత అమరవీరులైన అమాయకుల మృతకళేబరాళు పచ్చిగా పడి ఉన్నాయి. ఈనాడు ఆ దేశాల్లోని ప్రజలు తమను ఒకనాడు బానిసల్ని చేసిన వారితో కలిసి పక్కపక్కనే జీవిస్తున్నారని విమర్శించిన ధైర్యశాలి ఒలె సొయింకా.కెన్యా దేశానికి చెందిన మరో మేధావి, కవి నవలా రచయిత గూగీ వా థియాంగో. ఇతను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినవాడు. ‘డికాలనైజింగ్ ద మైండ్‌’, ‘మాటిగిరి’, ‘పెటల్స్‌ ఆఫ్‌ ద బ్లడ్‌’, ‘ది రివర్‌ బిట్వీన్‌’, ‘డెవిల్‌ ఆన్‌ ది క్రాస్‌’, ‘ప్రిజన్‌ నోట్స్‌’, ‘గాహికా దీండా’ లాంటి ప్రసిద్ద రచనలు ప్రపంచానికి అందించాడు. స్వదేశంలో ఎన్నో శతృ నిర్బంధాలకు గురై ఉద్యోగాన్ని వదిలి డిటెన్యూగా మారాడు. అలా జైలులో ఉంటూనే టాయిలెట్‌ పేపర్‌ మీద తన భావాలకు అక్షర రూపం ఇచ్చాడు. అక్కడ శతృ నిర్బంధాలు ఎంత కఠినంగా ఉండేవంటే నిర్బంధించే అధికారులు కేవలం గాయపర్చడంతో తృప్తి చెందరు. ఆ గాయం లోకి ఎప్పుడూ వేడి కత్తులు దూర్చి తిప్పుతూ అది మానకుండా ఉండాలని చూసే క్రూరులు వాళ్ళు.నైరోబి విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్‌ విభాగంలో పనిచేస్తూనే వలసపాలనకు చిహ్నమైన ఆంగ్లం స్థానంలో ఆఫ్రికా భాషలను అధ్యయనం చేయవలసిన ఆవశ్యకతను గుర్తెరిగి వాటి వ్యాప్తికి పరిశోధనకు పెద్దపీటవేయాలని తమ మాతృభాష అయిన గికుయు భాషలో తన రచనను కొనసాగించాడు.”సాంస్కృతిక సామ్రాజ్యవాదమే మానసిక అంధత్వాన్నికి, బధిరత్వానికి జన్మనిస్తుంది. అది ప్రజలు తమ దేశంలో తామేం చేయాలో విదేశీయులే నిర్ణయించేలా చేస్తుంది” అని పాశ్చాత్య సంస్కృతి మీద కత్తి గట్టిన గూగీ కుటుంబం నిత్యం కల్లోలాలతోనే సహజీవనం సాగిస్తోంది. గూగీ కొడుకు ‘మకోమ’ కూడా మంచి రచయిత.పైన పేర్కొన్న కవులూ, రచయితలూ వారి ఆచరణ, ప్రాపంచిక దృక్పథాన్ని పరిశీలించినట్లయితే వారిలో ఎక్కువ మందికి మార్క్సిజం పట్ల గల అచంచల విశ్వాసాన్ని గమనించవచ్చు. ఆఫ్రికాలో ఆయా దేశాల్లో జరిగిన వలసవాద వ్యతిరేక పోరాటాలు, స్వాతంత్రోద్యమ పోరాటాలు మన రాష్ట్రంలో జరిగిన సాహిత్య సాంస్కృతికోద్యమాలకూ కొంత సారూప్యత ఉంది. ఉదాహరణకు కెన్యాలో జరిగిన మౌ మౌ విముక్తి పోరాటం (1952-56)కు మన తెలంగాణా సాయుధ పోరాటం, శ్రీకాకుళ పోరాటాలకు సారూప్యత గమనించవచ్చు. వీటి రూపాలు వేరయినా సారం ఒక్కటే.మౌ మౌ విముక్తి పోరాటంలో స్వయంగా పాల్గొన్న జోమొకెన్యట్టా (మన నెహ్రూలాగే) ఓ బహురూపి. అక్కడ కెన్యట్టా సహచరులు ఎంతో మంది టెర్రరిస్టులుగా ముద్ర వేయబడి డిటెయిన్‌ చేయబడ్డారు. చిత్రహింసలు అనుభవించారు. కెన్యా మౌ మౌ సాయుధ పోరాటం గురించి గాదరింగ్ సీ వీడ్‌ (Gathering Sea weed: African Prison Writing) అనే పుస్తకాన్ని సమకూర్చి ముందుమాట రాసిన జాక్‌మపంజీ మాటల్లో ”కెన్యాలో కెన్యట్టాతో బాటు ఎంతో మంది విశ్వవిద్యాలయ అధ్యాపకులు, కవులు, రచయితలు ప్రాణాలు లెక్కచేకుండా చిత్రహింసలు అనుభవించారు. ఇక్కడ విచారకరమైన విషయమేమంటే కెన్యాకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశ నాయకుడి హోదాలో కెన్యట్టా ఒకప్పుడు తన సహచరులను, తర్వాత అతనితో రాజకీయంగా విభేదించిన కవులను, మేధావులను అంతరంగిక భద్రతా చట్టం పేరుతో ఎంతో మందిని తీవ్రవాదుల నెపంతో అరెస్టు చేయించాడు. అందులో ఎక్కువ భాగం నష్టపోయినవాడు గూగీ వా థియాంగో. ఇతను కెన్యట్టా మరణం తర్వాతనే విడుదల చేయబడ్డాడు”.కెన్యట్టాను చూసి ఆ దేశ ప్రజలు ఎన్ని భ్రమలు పెంచుకున్నారో మన దేశంలో కూడా కొందరు కమ్యునిస్టులు నెహ్రూ జేబుకు ఉన్న ఎర్ర గులాబీలో సోషలిజాన్ని చూసినవారూ ఉన్నారు. తెలంగాణ పోరాట (1948-51) కాలంలో ప్రజలే ‘రంగురంగుల మారి నెవురయ్యా! నీ రంగు బయిరంగ మాయె నెవురయ్యా! తేనె పూసిన కత్తి నీవు నెవురయ్యా’ అని పాటలు పాడారు.”స్వాతంత్య్రాన్ని వాంఛిస్తామని ఓ వైపు ప్రకటిస్తూనే మరో వైపు ఆందోళనను నిరసించేసేవాళ్ళు, అరక దున్నకుండా పంట పండాలని కోరుకునేటటువంటి వాళ్ళు, ఉరుములు మెరుపులు లేకుండా వాన కురవాలనుకొనేవాళ్ళు, సముద్రం హోరెత్తకుండా ఉండాలనుకునేవాళ్ళు” అని నల్లజాతి నాయకుడు ఫ్రెడరిక్‌ డగ్లస్‌ చేసిన వ్యాఖ్య విశ్వజననీయమైంది. ఇది మన రాష్ట్రం లోనూ కొన్ని సమూహాలకు వర్తిస్తుంది.ఇలా ఒకనాటి చీకటి ఖండం నల్లని సంకెళ్ళను తెంచుకొని తమ మనుగడకోసం పోరాటాన్ని ఏనాడో ప్రారంభించింది. ఆ పోరాటాల్లో జాతీయతను సుస్థిరం చేసుకొనే లక్ష్యం నుండి ప్రజారాజ్యాలకోసం తపనపడే విముక్తి పోరాటాలే దాని సంకేతంగా మారాయి.కవులూ, కళాకారుల మీద నిర్బంధాలు స్థలకాలకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నవే. ఆక్రమంలో మన రాష్ట్రంలో ఎందరో మేధావులు కృషి చేశారు. నమ్మిన విశ్వాసానికి తన ప్రాణాలను అర్పించారు. వాళ్ళంతా వ్యవస్థలోని అసమానతలకు కలత చెందారు. కాబట్టే అలా రాయగలిగారు.వ్యస్థలోని అపసవ్యత కళాకారుడికి ప్రేరణ కావాలి. తత్‌ఫలితంగా కళారూపం నిలవాలి.A poet’s mind exudes poetry only when he is disturbed. Only turblance roduces some thing worth remembering.ఆఫ్రికాలోని కవులూ, మేధావులూ ఆ వ్యవస్థకు కలత చెందారు కాబట్టే ఇప్పుడు మనం చర్చించిన ఇంత సృజన రాబట్టగలిగారు.ఎంతో హింసను మనం నిత్యం చూస్తున్నాం. దమనకాండను అనుభవిస్తున్నాం. అభద్రతా భావంతో, భావ ప్రకటనా స్వేచ్ఛను పాక్షికంగానే అనుభవిస్తున్నాం. అది వాకపల్లి మహిళల ఆర్తనాదం కావచ్చు. మరి ఏదండి సృజన?”దేహాన్ని చంపేవాళ్ళంటే భయపడనక్కర్లేదు కానీ, చైతన్యాన్ని చంపేవాళ్ళంటేనే భయపడాలి. వాళ్ళు ఇతరులను చంపినట్లే నన్ను కూడా చంపినప్పటికీ, నా చైతన్యాన్ని మాత్రం చంపెయ్యలేరు. స్వతంత్రంగా నిలబడాలనే ఈ దేశం సంకల్పాన్ని వాళ్ళు చంపలే”రని సామ్రాజ్యవాదుల నుద్దేశించి వరరు కాంజా చేసిన ప్రకటన కేవలం ఆఫ్రికాకే పరిమితం కాదు. ఇది విశ్వవ్యాప్తం అవుతుంది.ఇక్కడ కేవలం ”వ్యక్తులను” నిర్మూలించే పనిలో ఉన్నవాళ్ళు ”చైతన్యాన్ని” మాత్రం ఎప్పటికీ చంపలేరని ఎన్నాళ్ళకు తెలుసుకోవాలి?References:1. Gathering sea weedAfrican prison Writing/ Edited by Jack Mapanje. (Heinemann ప్రచురణ: 2002).2. Mau Mau Patriotic Songs - a letter from Prison kinathi3. Ken Saro Wiwa - Defence Statement.4. N.Gugi - Refusing to Die/ toilet paper5. N.Gugi - Devil On the Cross/ Matigiri/ Prison notes6. ప్రపంచ సాహిత్యంలో తిరుగుబాటు ఉద్యమాలు - నిఖిలేశ్వర్‌7. ‘ప్రజాసాహితి’ ప్రత్యేక సంచికలు - 1980-20008. Literature for Composition/ Harper Collins Publication by Sylan Bernet9. Chinua Achibe - Death and Kings Horsemanప్రపంచ సాహిత్యం, సాహిత్య వ్యాసాలు2 అభిప్రాయాలుvemuganti మార్చ్ 2008 1 african literature meeda manchi essaykoresh ఏప్రిల్ 2008 2 సహిత్య విద్యర్దికి తెలిని ఇన్ని విషయాలు ఉన్నయా
Posted by GURRAM SEETA RAMULU at 18:09 0 comments Links to this post

డా కానూరి హరీష్ స్మృతిలో .........

డా కానూరి హరీష్ స్మృతిలో

.వైద్యవృత్తినివదిలి సమాజానికి శస్త్రచికిత్స చేయడం కోసం ప్రాణాలర్పించిన డా చాగంటి భాస్కరరావు త్యాగం గూర్చి మనకు తెలుసు.పౌరహక్కుల ఉద్యమంలో రాజ్యం కసాయి తనానికి బలి అయిన డా రామనాధం కూడా తెలుసు.వారి స్ఫూర్తితో శాస్త్రీయ అవగాహన, సేవానిరతి, త్యాగం అలపర్చుకొని ప్రజలకు వైద్య సేవలందిస్తూ వచ్చినఖమ్మం పట్టణ ప్రముఖ వైద్యులు డా కానూరి హరీష్‌ మనకికలేరు.వారు సెప్టెంబర్‌ 22, 2006న కన్నుమూసారు.తెలంగాణాలో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నవారిలో కాకతీయ వైద్య విద్యార్ధుల పాత్రగానీ,ఉస్మానియా ఇంజనీరింగు విద్యార్థుల పాత్రను గానీ తక్కువగా అంచనా వేయలేము.ఆ క్రమంలో డాక్టర్లలో మొదట అమరులయింది డా రామనాధం అయితే రెండో వ్యక్తి డా అంకం బాబూరావు.తెలంగాణా వైద్య విద్యార్ధుల కార్యకలాపాలను గూర్చి రాసేటప్పుడు ఆ ఇద్దరినీ జ్ఞాపకం చేసుకోవాలి.మహోన్నత నక్సల్బరీ, శ్రీకాకుల రైతాంగ పోరాటాల స్ఫూర్తితో కాకతీయ వైద్య విద్యార్ధులు,అందున 1960 - 70 చివర రోజుల్లో ఆ భావాజాలాన్ని అందుకున్న మొదటి తరం వాళ్ళలో డా హరీష్‌ ఒకరు.డా హరీష్‌ 1942 నవంబర్‌ 2న క్రిష్ణాజిల్లా పెదమద్దాలి గ్రామంలో జన్మించారు.ఖమ్మంలో స్థిరపడి, వైద్యవృత్తిని అభ్యసించడం కోసం 1962లో వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాలలో చేరారు.అందరూ ఊహిస్తున్నట్లు వైద్య విద్యార్ధులు కేవలం పుస్తకాల పురుగులు కారని,వారిలో సామాజిక స్పృహ ను రగిల్చితే సమాజానిక వారెంతో సేవ చేయగలరని నిరూపించిన మొదటి తరం విప్లవ విద్యార్ధుల్లో డా హరీష్‌ ఒకరు.ఒక మనిషి కమ్యూనిస్టు అయినప్పుడు కమ్యూనిస్టు సంస్కృతిని ఆచరిస్తాడు.దానికి నిదర్శనంగా వైద్యం చదివే రోజుల్లో వాళ్ళంతా కమ్యూన్‌ జీవితాన్ని అలవర్చుకొన్నారు.అక్కడే డా కావూరి రమేష్‌బాబు, వాసిరెడ్డి రామనాథం తదితరులు వీరి సహ విద్యార్ధులు.వీరంతా 60, 70వ దశకాలలో ఉవ్వెత్తున లేచిన ప్రజా ఉద్యమాల పట్ల సహజంగానే ఆకర్షితులైనారు.కొందరు వ్యక్తులు ఈ సమాజంలో వైరుద్యాల పరిష్కారానికి పోరాటాల ద్వారా రాజకీయరంగంలో ఉండి ప్రయత్నిస్తే, మరికొందరు ‘ప్రజలకుసేవ’ అనే విలువ ద్వారా, ఆచరణ ద్వారా,సాంస్కృతిక రూపంలో సాంస్కృతిక రంగం ద్వారా ప్రయత్నిస్తారు. నాకు తెలిసి ఆచరణ ద్వారా,నమ్మిన విశ్వాసానికి, వ్యక్తిగత ఆచరణకు తక్కువ వైరుధ్యాలున్న వ్యక్తులలో డా హరీష్‌ ఒకరు.ఆ విషయం వారి ఆచరణ, వాళ్ళ ఇంట్లో పనిచేసేవారిని, వారి సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను అడిగితే తెలుస్తుంది.డా హరీష్‌కు సాహిత్య, సంస్కృతిక రంగాలతో గత మూడు దశాబ్దాలుగా ఉంది.ఆయా సంస్థల పట్ల సానుభూతి పరుడుగా ఆయన చేసిన కృషి అసమాన్యమైనది.చారిత్రిక విరసం మొదటి మహాసభ నిర్వహణకాని,రైతు కూలీ సంఘం సభకాని, ”చెరబండరాజు స్మారక పురస్కారం” పేరుతో ప్రగతిశీల కవులకు ఇస్తున్న చేయూత చూస్తే వారి భావ జాలం ఏమిటో తెలుస్తుంది.అసాధారణ ప్రతిభాపాటవాలు ఉన్న వారికి సంగీతం అన్నా, సినిమా అన్నా అత్యంత ప్రీతిపాత్రమైనవి.లక్షలాది రూపాయలతో ఆయన సేకరించిన విలువైన పుస్తకాలు, సినిమాలు, మ్యూజిక్‌ క్యాసెట్లు, ఇందుకు సజీవ సాక్ష్యాలు.మార్కెట్లోకి వచ్చిన ప్రతి పుస్తకాన్ని దాదాపు నాల్గు దశాబ్దాలుగా సేకరించారు.సేకరించిన పుస్తకాలు కేవలం అలంకరణ కోసం కాదని, నిత్యం చదువుతూ,చదివేవారిని ప్రోత్సహిస్తూ, జీవితాంతం పుస్తకాల మధ్యనే గడిపారు. ఆ క్రమంలోనే వారు నాకు అలగ్జాండర్‌ కుప్రిన్‌, ఆల్బర్ట్‌ మురావియో, సాల్‌బెల్లో తదితర రచనలను పరిచయం చేసి ప్రోత్సహించారు.కొందరు తన వారసులకు బంగారం, భవనాలు ఇస్తారు.హరీష్‌గారు తన వారికి లక్షలాది పుస్తకాలను, సినిమాలను,విలువైన పెయింటింగులను ఉదారమైన తన భావజాలాన్ని ఇచ్చి వెళ్ళారు.మంచివిమర్శకులైన హరీష్‌ ‘రామారావు’ పేరుతో మంచి కథలు వ్రాశారు.తానే స్వయంగా ‘స్వేచ్ఛ ప్రచురణ’లు పేరుతో క్రిస్టఫర్‌ కాడ్‌వెల్‌, ఫాలోఫ్రేయిరీ, గ్రాంసీ,ఏ.పి. యట్‌ క్రాస్‌ రోడ్స్‌ తదితర రచనలను తెలుగువారికి అనువదింపజేసి అందించారు.ప్రముఖ విప్లవ కవి ‘శివసాగర్‌ సాహిత్యం’ మొత్తం ఒకే సంకలనంగా వేసినాతో ప్రతి కవితకు పుట్‌నోట్స్‌ వ్రాయించి, అచ్చు వేయించారు.1970 నుండి రావిశాస్త్రి, కారా మాస్టారు, శ్రీపాద, వేగుంట, పతంజలి లాంటి సాహితీవేత్తలను ఖమ్మం రప్పించారు.‘చేరా మాస్టారు అభినందన సభ’కు తానే గౌరవాధ్యక్షులుగా ఉండి గొప్పగా నిర్వహించారు.మితభాషి, సునిశితమైన పరిశీలన కలిగినవారుమన ‘శ్రీశ్రీ’ అనే కవితలో శ్రీశ్రీ గురించి చెప్పడం చరిత్ర ముడివిప్పడం గత కాలపు కందిరీగ తుట్టెను కదిలించడం ఒక శతాబ్దాన్ని ఇంతగా కల్లోలపరిచిన కొద్ది మందిలో శ్రీశ్రీ ఒకరని గొప్ప విశ్లేషణ చేశారు.నేటి మనిషి మానవ సంబంధాలను , అనుబంధాలను డబ్బుతోనే మారకం వేసుకుంటున్నాడనీ, మనిషి పరాయికరణకు గురైన వస్తువని, డబ్బు ఖర్చు పెట్టనిదే మనిషి శవం చుట్టూ చేరి కన్నీరు కార్చడానికి కూడా ఎవరికీ తీరికలేదని,సమాజపు సందుల్లో ఒక రాబోట్‌లా, పందిలా మిగిలాడని, నేడు మరో తెల్ల దేశపు బానిస కాబోతున్నాడనీ, బానిసగా అమ్ముడుపోబోతున్నాడని మానవ నైజాన్ని వివరించారు.చరిత్రలో వెనుక నడిచే వారికి బాట చూపించడానికి నేడు రక్త తర్పణ తప్పదనీ, రక్తంతోనే రహదారి వేయాలనీ,లేకపోతే దారి తప్పుతారనీ, పరోక్షంగా ఈ దేశంలోనే సాయుధ పోరాటాన్ని సమర్ధిస్తూ చెప్పిన విషయాన్ని గమనించవలసి ఉంది. అలాసాగే ఈ క్రమంలో పతితులు, భ్రష్టులూ, మూలనున్న ముసలవ్వలు, దగాపడిన తమ్ముళ్ళు, దౌర్భాగ్యులు మరి జేబుదొంగలు అందరూ ఒకరుగా ఏకంకాక తప్పదనీ, ఈ సమాజం సృష్టించిన దిష్ఠిబొమ్మలు వాళ్ళు అని వాపోయారు. ఎంతో వ్రాయగలిగే సామర్థ్యం ఉండి, వ్రాయకుండా ఉన్న ఆయన నిర్లప్తతను నేను ఒకసారి ప్రశ్నించాను.”నేను ప్రస్తుతం జీవించే జీవితానికి, ఆచరణకు వైరుద్యం ఉందని అందుకే రాయాలని అనిపించడం లేదని చెప్పారు”. అందుకే ఇన్ని వైరుద్యాలున్న ఈ వ్యవస్థలో మనిషి కనుమరుగు అవుతున్నాడని అన్నారు.అయినా వైద్యరంగంలోనే తన జీవిత చరమాంకాన్ని గడిపారు.ఖమ్మం - ఫిలింసొసైటీ, పూలె - అంబేద్కర్‌ నేషనల్‌ ఇన్‌స్టూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌, జనవిజ్ఞాన వేదిక, రెడ్‌క్రాస్‌, సాహితీ స్రవంతి, virasam ku sannihitudu gaa ....లింబ్‌సెంటర్‌ తదితర 20 సంస్థలు వెతుక్కుంటూ హరీష్‌ను గౌరవధ్యక్షునిగా చేసి తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. వారిని ఉత్తేజపర్చింది కమ్యూనిస్టు విప్లవ భావజాలం గనుకనే ఆయన ఇలా ధృడ చిత్తంతో తుదకంటూ తన కృషిని కొనసాగించగలిగారు.ప్రతిరోజు సాయంత్రం స్థానిక ప్రజాశక్తి పుస్తకాల షాపులో సాహితీ మిత్రులతో రెండు, మూడు గంటలు గడిపే అలవాటు. ఎంతో మంది డాక్టర్లు, కవులు, కళాకారులు, విద్యావేత్తలు ఆ సాయంకాల సమయాన్ని పంచుకొనే వారు.ఆ మిత్ర బృందంలో అత్యంత చిన్న వయస్సు నాదే. ఆయన నా పట్ల ప్రత్యేక వాత్సల్యాన్ని చూపేవారు.ఖమ్మం నెహ్రునగర్‌లోని హరీష్‌ గారి నిలయం ”నెలవంక”. నిత్యం సాహితీ మితృలకు చల్లని పందిరి.కొత్త ఆకాశాలకోసం అరమోడ్సు కళ్ళతో తలపించిన ‘నెలవంక’ కలల్లేని తనంతో వెలవెల బోతూంది.ఇప్పటికీ సాయంకాల సమావేశాలం కొనసాగుతూనే ఉన్నాయి.కాని వారి కుర్చీ ఖాళీగానే ఉంది. ఆ శూన్యాన్ని మేము భరించలేకుండా ఉన్నాం.మా కవి మిత్రుడు షుకూర్‌ మున్నేటి ఒడ్డున విగత జీవిగా ఆయన భౌతికకాయం చితిమంటలలో చూసి చలించి ఇలా చెప్పారు”నువ్వులేవు నీ మాట ఉంది.ఆఖరి సభలో అశువ్రులే పేక్ష్రకులునీ జ్ఞాపకాలు తప్ప ఏవిూ కనిపించలేదుఒక్క నీ మౌనం తప్పఏవిూ వినిపించలేదు”…* * *

17, అక్టోబర్ 2008, శుక్రవారం

ఆత్మా గౌరవ యుద్ధ కవిత కందిలి

ఆత్మగౌరవ యుద్ధ కవిత కందిలి
06:29 am on అక్టోబర్ 2nd 2008-->గుర్రం సీతారాములు
“మహా కవుల మరణ యుద్ధ కవిత” పేరుతో మార్చి 2 వార్త ఆదివారం అనుబంధంలో“దళిత కవులు ఇంకా బ్రతికే ఉన్నా దళిత కవిత్వం మాత్రం మరణించిందని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదని ‘కందిలి’ లాంటి కవితా సంకలనాలు రుజువు పరుస్తాయి” అన్న తీవ్రమైన వ్యాఖ్యలకు సమాధానం ఇది.
గత రెండు దశాబ్దాలుగా సమకాలీన సాహిత్య వాద వివాదాలను సమీక్ష, విమర్శకుల అభిప్రాయాలను శ్రద్ధగా గమనిస్తున్న నా పరిమిత జ్ఞానంతో ఇది రాస్తున్నాను. ఇంతగా స్పందించడానికి కారణం “ సాహిత్య విమర్శకులకు అంత్యక్రియలు నిర్వహించండ”ని అన్న సీతారాం కొందరు దళిత సాహితీ విమర్శకుల బాధ్యతారాహిత్యం వల్లనే దళిత కవిత్వం మరణించిందనీ కొందరి అసమర్థత వల్లనే అది అత్యంత అవమానకర రీతిలో దారి తప్పిందనీ అన్నారు.
ఈ సందర్భంగా దళిత సాహిత్యం పట్ల, కవుల పట్ల సాహిత్య అకాడమీల నిర్లిప్తత గూర్చి ఓ గుజరాతీ దళిత కవి ఆక్రోశాన్ని కొంచెం కటువుగా ఉన్నా చర్చించుకోవడం అవసరం అనిపిస్తోంది.
“ భాష అనే లంజముండ సాహిత్య అకాడమీ వేశ్యావాకిళ్ల ముందు తచ్చాడుతున్న కొజ్జాల వంక కృద్దంగా చూస్తోంది” అన్నాడు.నేడు అస్థిత్వ కులాల సాహిత్యం కూడా నోరున్న, పేరున్న సాహిత్య విమర్శకుల, సమీక్షకుల ముందు అణిగిమణిగి వుంటోంది.వర్తమానాన్ని గమనించినట్లయితే సంఘంలో అకవులు, కుకవులు, పైగంబర, దిగంబర, పోస్ట్‌మోడ్రన్‌ వగైరా..వగైరా వెనకబడిన కులాల కవులుగా చీలికలు, పేలికలుగా మారిన కవిత్వ కూటాలను “కందిలి” కవులు మరింతగా దిగజార్చారని సీతారాం ఆవేదన చెందుతున్నాడు.పైగా దళిత కవులలో ఒక సంక్షోభం ఏర్పడిందనీ, దాన్ని అధిగమించకపోగా జటిలమైన వర్గీకరణ రాజకీయాల వైపు దళిత సాహిత్య ప్రస్థానం చెందిందనీ ఆక్షేపించారు. మరియు లక్ష్మీనర్సయ్య, సతీష్‌ చందర్‌, కె.శ్రీనివాస్‌, అసుర లాంటి విమర్శకుల మౌనం దళిత కవిత్వాభిమన్యుడుకి పద్మవ్యూహంగా మారిందనీ, కొంతమంది కవులు ఉన్న కొద్దిపాటి రక్తాన్ని ఊరికే మరిగించుకొని అలసిపోతున్నారని అన్నారు..ఈ సందర్భంగా దశాబ్ధం క్రితం వెలువడ్డ బిసి కవుల “వెంటాడే కలాలు” పుస్తకానికి రాసిన ముందుమాటను గుర్తుకుతెచ్చుకోమని సీతారాంను కోరుతున్నాను.
అందులో ఇంతకాలం దళిత కవిత్వం మాలమాదిగ కవులు హైజాక్‌ చేశారనీ, దళిత సాహిత్యం అంటే ఆ రెండు కులాలు మాత్రమే కాదనీ దాన్ని పరిపుష్ఠం చేసింది, అధికంగా చెమట కార్చింది మంగళ్ళు, చాకళ్ళు లాంటి వెనకబడిన కులాలేననీ “బిసి కవిత్వం” పేరుతో ఓ చర్చను లేపడంలో పైన ఉదహరించిన వారిలో కొందరూ, మరియు జూలూరి గౌరీశంకర్‌, ప్రసేన్‌తో మరికొందరూ ఉన్న విషయం ఈ అష్టాది కవుల సమన్వయంతో కొత్త శిశువుకి జీవం పోసిన వీరు దేశీయ మార్కిజం పేరుతో స్వదేశీ మార్క్సిజాన్ని వెలుగులోకి తెచ్చి ఎవరినోట్లో ఏమేం పోశారో సాహిత్య లోకం మర్చిపోలేదు.
దళిత కవిత్వం వారి, అస్తిత్వ చైతన్యం, ఆగ్రహం గత కొంత కాలంగా మనువు నోట్లో పోసిన ఉచ్చనే మళ్ళీ మళ్ళీ పోయడం మరో విధంగా ఉచ్చపోయకపోవడాన్ని తప్పు పట్టిన సీతారాం మరెలా పోయాలో నేర్పిస్తే బాగుంటుందేమో! కవిత్వానికి కావాల్సిన ఒడ్డు, పొడవు, నడుము కొలతలు,సాంధ్రత, గాఢత, విస్తృతిలాంటి కొన్ని కొలిచే పనిముట్లను నిర్దేశించిన సీతారాం అర్థంపర్ధం లేని పోస్ట్‌మోడ్రన్‌ కవిత్వాన్ని ప్రమోట్‌ చేసి, తాళాలు మాత్రం నా దగ్గర ఉన్నాయి అని ఎలా అనగలిగారు? ఆయన అన్నట్లు కందిలి కవితా సంకలనంలో కవిత్వం లేకపోయినా ఇది గొప్ప ప్రయత్నం, ఈ ప్రయత్నం వెనుక అంతులేని ఆవేదన ఉంది. ఆ ఆవేదన వెనక వేల సంవత్సరాల దాష్టీకం ఉంది. బ్రాహ్మణ వాద గుట్టును నిట్టనిలువుగా చీల్చే ప్రయత్నమే ఇది. ఇది ఓ అంటరానివాని ఆక్రందన, తన పుట్టుకను దుర్మార్గంగా చిత్రించినందుకు చరిత్రలో జరిగిన ద్రోహానికి కారణాల వెతుకులాట, సామాజిక ఉద్యమాల చైతన్యంతో వచ్చిన స్ఫూర్తితో జరిగిన ఈ ప్రయత్నం హర్షించదగినది. ఆహ్వానించదగినది.వర్గీకరణ రాజకీయాలు తెచ్చిన చైతన్యంతో వచ్చిన బలమైన కవిత ఎండ్లూరి సుధాకర్‌ “వర్గీకరణీయం” అంతకుముందు వచ్చిన నాగప్పగారి సుందర్రాజు రచనలు, మల్లెమొగ్గల గొడుగు, ఎదురుచూపులు కథా సంకలనం గోగు శ్యామల, సుభద్రల నల్లరేగడిచాళ్లు, పరిమళ్ , వేముల ఎల్లయ్య జిలుకర శ్రీనివాస్‌, డా. దార్ల, ప్రొ.డివి కృష్ణ, కదిరె కృష్ణ, ఐనాల సైదులులాంటి బలమైన సాహితీ విమర్శకుల, కవుల కవిత్వాన్ని మనసు పెట్టి చదవమని కోరుతున్నాను. ఇటీవల సెంట్రల్‌ యూనివర్శిటీలో మాదిగ, మాదిగ ఉపకులాల కవుల రాష్ట్ర స్థాయి సదస్సులో జరిగిన చారిత్రక విషయాలను తెలుసుకోమని చెప్తున్నాను. కందిలి కవిత్వం రాజకీయ నినాదమై తేలిపోయిందని విశ్వవిద్యాలయంలో పరిశోధన చేయడానికి “కందిలి కవిత్వం-ఒక పరిశీలన” అనే అంశానికి బాగా పనికొచ్చే పుస్తకం అని ఎద్దేవా చేయడం యూనివర్శిటీలో అధ్యాపక వృత్తిలో ఉన్న సీతారాం ఈ రకమైన వ్యాఖ్య చేయడం ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది.
ఆయనే అన్నట్లు కందిలి కవిత్వం వెనుక ఉన్న జీవితం పెద్దది ఆ సంస్కృతి మరి ఏ ఇతర సంస్కృతి కన్నా తక్కువది కాదు, ఎందుకంటే మానవ జీవితానికి ఉన్న అనేక విలువల స్ఫూర్తి మాదిగ కులానికి ఉంది. అద్వితీయమైన అనుభవసారం ఉంది. సమాజానికి శ్రమ సంస్కృతినీ, శాస్త్రీయమైన చర్మ శుద్ధినీ, ఆది మానవ దశలోనే సంస్కృతికి డప్పును అందించిన గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్న మాదిగ కులం వ్యవస్థకు పట్టిన మలినాన్ని శుద్ధిచేసి పరిశుభ్రతను ప్రసాదించిన మహోన్నత వారసత్వం మాది. ఆది జాంబవ వారసులైన మాదిగలం మేము ఈ సమాజం మాదిగీకరణ చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని గట్టిగా చెప్తున్నాం.
నేను ఎండలో ఎండుతున్న ఎండు మాంసాల హారాన్ని. కాల్పనిక సింహద్వారాల మీద ఎగరేసిన గెలుపు జెండాని, ఆ గెలుపు జెండా ఎగరేసే రోజు ఎంతో దూరంలో లేదు.
సాహిత్య వ్యాసాలు



3 అభిప్రాయాలు
raju nayak అక్టోబర్ 2008 1

Dear Sir,first of all i would like to thank Seeta Ramulu for writing on self respec and critiking post modern writers. its a wander full పీస్
.రాజు

pasunoori రవీందర్
అక్టోబర్ 2008 2
గుర్రం సీతారాములు గారికి ముందుగా అభినందనలు,అయితే విమర్శ వ్యక్తిగతంగా కాకుండా వ్యవస్థకు సమాధానమిచ్చే విధంగా ఉంటే ఇంకా బాగుండేది. అయితే విమర్శకులు సీతారాం గారు అలా కదిలించడం కూడా అవసరమేమోఆలోచించాలి, సీతారాం గారు దళిత వ్యతిరేకులైతె కాదు.వారి విమర్శను ఒక సోయి కోసం స్వీకరిస్తె మంచిది.ఏది ఏమైన ఆత్మగౌరవం కోసం గుర్రం గారికి ఉన్న ఆవేదన అర్థం చేసుకోతగిందిమరిన్ని దాడులకు సమాధానమిచ్చేందుకు సమయాత్తం అవుతాడాని,
అవ్వాలనిఆశిస్తూ
పసునూరి రవీందర్

GURRAM SEETARAMULU అక్టోబర్
2008 3

రవి గార్కి ధన్యవాదాలునీ నెప్పుడూ పరనింద చెయలెదండీసీతారా0 గారు విమర్సకులకు అంత్యక్రియలు నిర్వహించండీ అన్నారుఅతను విమర్సకుడు కాడ0డీవీ లుంటే వెంటాడే కలాలు ముందు మాట చదవండీనీ ను వొక ఛఃర్చ పెట్టటము కొసము రాసాన0డీచర్చ్గ కొన సాగాలని ఆసిస్తూ

కొన్ని ఎముకలు ఇంకొన్ని గింజలు

కొన్ని ఎముకలు ఇంకోన్నిగింజలు
కొన్ని ఎముకలు… ఇంకొన్ని గింజలు- గుర్రం సీతారాములు"ద ఫ్లష్ ఈజ్ Heavy ఆన్ మై బ్యాక్, షీ ఈజ్ మై డాటర్… జస్ట్ టర్న్‌డ్ ఫిఫ్టీన్… ఫీల్ హర్ బి బ్యాక్ సూన్…''ఈ వాక్యం నన్నెంతో డిస్ట్రబ్ చేసింది. ప్రముఖ ఒరియా కవి జయంత్ మహాపాత్ర రాసిన 'ది హంగర్' లోనిదా వాక్యం.ఓ అరవై ఏళ్ళ ముసలివాడు తన పదిహేనేళ్ళ కూతురుతో సముద్రంలో చేపలు పట్టి రోజూ చస్తూ బ్రతుకుతున్న బీదకుటుంబ కథాంశం అది. తీరంలో గట్టిగా గాలివాన వస్తే మాయమయ్యే పూరిపాక అది. తండ్రి కూతుళ్ళకు శరీరం మీద సరైన ఆచ్ఛాదన లేదు. శరీర పోషణ, సరైన బట్టలు లేని ఆ అమ్మాయికి వయస్సును మించిన తన శరీరం వంపుసొంపులు దాచుకోవడానికి బారెడు గుడ్డలేని దీనస్థితి వాళ్ళది. తండ్రితోబాటే తీరానికి రోజూ వచ్చేది. సముద్రంలోకి వెళ్ళిన తన తండ్రి వచ్చేదాకా ఒడ్డునే తచ్చాడుతూ సాయంత్రం దాకా ఎదురుచూడడం నిత్యకృత్యం ఆమెకు. మనుగడే ప్రశ్నార్థకమైన ఆ ముసలాడికి ఆమె ఓ గుదిబండ, తలకు మించిన భారం. ఆమె పెళ్ళి గురించి ఆలోచించే ధైర్యం, తీరిక కూడా ఆ ముసలాడికి లేదు. ఎంతో కష్టపడితే తప్ప నోట్లోకి నాలుగు మెతుకులు పోవడం దుర్లభం. వాళ్ళ జీవితంలో ఏలినాటి శనిలా దరిద్రం ఆ ఇంట దాపురించింది.ఆ సాయంత్రం అతను సముద్రం నుండి తీరానికి చేరాడు. ఆకాశం ఉరిమి ఎప్పుడు మీద పడుతుందా అన్నట్లుంది, అంతా శూన్యంగా వుంది. గత రెండు మూడు రోజులుగా తినడానికి ఏమీలేకపోవడం మూలాన అతనికి నిలబడే ఓపిక నశించింది. ఏడ్చేందుకు కూడా శరీరం సహకరించటం లేదు. అతని కన్నీళ్ళు ఎప్పుడో ఇంకిపోయాయి. తీరం అల్లకల్లోలంగా ఆ ముసలోడి మనసులాగే ఉంది. సందర్శకులు ఇళ్ళకు వెళ్ళడానికి తొందరలో ఉన్నారు. తీరం దాదాపు ఖాళీగా ఉంది. ఎవరి తొందరలో వాళ్ళు గబగబా ఉరుకుతున్నారు. ప్రతిరోజు యూనివర్సిటీ కుర్రాళ్ళు సరదాగా సముద్రతీరానికి వస్తుంటారు. గుంపులు గుంపులుగా అరుపులు, కేరింతలతో నీళ్ళలో ఒకళ్ళను మరొకరు తోసుకొంటూ సరదాగా వాళ్ళ జీవితంలో బాధలన్నీ ఆ తీరంలో గుమ్మరించిపోతారు. అందులో కొంతమంది కేవలం శరీర వాంఛలు తీర్చుకోవడానికే వస్తారు. వచ్చిన కాడ్నించి ఎప్పుడూ శరీరమంతా కళ్ళేసుకొని వెతుకుతుంటారు. కాస్త నాలుగు పైసలున్నవాళ్ళు రెగ్యులర్‌గా, లేనివాళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు. ఓ పాతికేళ్ళ విద్యార్థి నిత్యం తీరానికి రావడం, వేశ్యల కోసం వెంపర్లాడటం నాలుగు పైసలు ఇచ్చి తన వాంఛ తీర్చుకోవడం అతను ఎన్నోసార్లు గమనించాడు. ఎర్రగా బొద్దుగా ఉన్నాడు. చేతికి ఖరీదైన వాచ్, మెడలో చైన్, ఉంగరాలు, ఖరీదైన బట్టలు మంచి కుటుంబం నుంచి వచ్చినట్లే ఉన్నాడు. కాకుంటే కండ కావరంతో ఉన్నాడు. ఆరోజు ఎవరూ దొరకలేదనుకుంటా ఇసుకలో కాళ్ళను ఈడ్చుకొంటూ, ఒడ్డున గవ్వలను తన్నుకుంటూ తనవైపు వస్తున్నాడు. ఆ ముసలాడికి ఆ రోజుతో ఇంతకాలం తను పెట్టుకున్న ఆశలు ఆవిరైపోయినాయి. నమ్మిన సముద్రమే మింగేసేటట్టుంది. తను జీవితంలో ఎంతోకాలంగా ఓడిపోతూనే ఉన్నాడు. అతను కేవలం బ్రతకడం కోసం మాత్రమే ఓడిపోయాడు. ఇక ఎంతోకాలం ఆ ఓటమికి తట్టుకోలేడు. కేవలం ఆ ఓటమికి తలవంచి మాత్రమే తాను ఆ నిర్ణయం తీసుకొన్నాడు. అందుకే అతను తన స్థితికి తలవంచి ఆ కుర్రాణ్ణి పిలిచాడు. కొంతసేపు మాట్లాడి అతని ఆంతర్యం గ్రహించి…
"బాబూ! ఇది నా కూతురు. మొన్ననే పదిహేను దాటాయి.''"ద ప్లష్ ఈజ్ హెవీ ఆన్ మై బ్యాక్… ద స్కైఫెల్ ఆన్ మీ ఫిల్ హర్ బి బ్యాక్ సూన్…''"వర్షం వచ్చేటట్లుంది బాబూ- బహుశా లాస్ట్ బస్ కూడా వచ్చే టయమైంది. అలా వెళ్ళి పని ముగించుకొని తొందరగా వచ్చేయ్!'' అంటూ ఆమెను అతనికి అప్పగించి తన దుఃఖాన్ని దిగమించుకొంటూ అక్కడ నుండి నిష్క్రమించాడు.ఆ అమ్మాయి కళ్ళు గాజుగోలీల్లా కళాకాంతి లేకుండా ఉన్నాయి.ఆ కళ్ళల్లోంచి చూస్తే ఆమె ఎముకలు కనిపిస్తున్నాయి. యాంత్రికంగా అతన్ని అనుసరించిన ఆమె వాంఛా రహితంగా తన కాళ్ళను ఎడంగా జరిపి అతనికి వశమౌతుంది. అప్పుడే దూరంగా ఉన్న ఆ ముసలాడి సంచిలో ఉన్న చేపలు గిలగిలా తన్నుకున్నాయి.తన ఆకలి తీర్చుకోవడం కోసం కన్న కూతుర్ని ఆ క్షణానికి అమ్మిన ఆ తండ్రి నిస్సహాయత, విధిలేక నిష్క్రియాపరురాలైన ఆమె ఆ యువకుడి మగతనం క్రింద నలిగి నుజ్జయి ఆ నాటకంలో ఎలా ఆటబొమ్మగా మారిందో చెప్తుందీ పోయమ్.ఈ దేశంలో కేవలం వృత్తిని నమ్ముకొన్నవాళ్ళకు ఏం మిగుల్తోందో ఈ కవిత చెపుతోంది. ఈ కవిత చెప్తుంటే అమ్మాయిలు కొంతమంది సిగ్గుతో తలవంచుకొని ఒకింత అసహనానికి గురైనారు. మరి కొంతమంది అబ్బాయిలు మిడ్‌నైట్ మసాలా చూస్తూ తాత్కాలిక సుఖానికి లోనైనట్లు నవ్వుకొన్నారు. అతికొద్దిమందిలో ముఖంలో రంగులుమారి కళ్ళ కొనుకులలో తిరిగిన నీళ్ళసుడిని చూశాను మరికొంతమందిలో.తరగతి గదిలో చాలాసేపు అందరూ పూర్తిగా ట్రాన్స్‌లో ఉన్నట్లున్నాము."సార్! బెల్ కొట్టారండి!'' అని ఓ విద్యార్థి అనడంతో సుదీర్ఘ నిశ్శబ్దం తర్వాత మామూలు మనిషిని అయ్యాను.చేతుల్లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్‌వారి 'కామన్‌వెల్త్ పోయెట్రీ' ఆంతాలజీలోంచి బొక్కలపొడి చూర్ణంలా రాలిపడుతోంది. ఎముకల వాసన వస్తోంది. ఈరోజు శుభ్రంగా కడుక్కోవాలి. ఒంటికి అంటిన ఆ గులాలు (రంగులు) ఇంకా వదలడంలేదు. ఎంత రుద్ది కడిగినా ఆ రంగు పోవడంలేదు. ఇంకా ఎంతకాలం కడగాలో అర్థం కావడంలేదు.పుస్తకం తీసుకొని స్టాఫ్‌రూమ్‌కి బయలుదేరాను. పొడి దారి వెంట రాలుతూనే ఉంది. ఒంటి మీద చొక్కాలోంచి ఆ రంగుల వాసన ఇంకా వస్తూనే ఉంది… బయట ఎవరో తరుముతున్నట్లు అటుయిటు ఉరుకుతున్నారు. కేరింతలు కొడుతున్నారు. అలా స్టాఫ్‌రూమ్ వైపు నడుస్తున్నాను. క్యాంపస్‌లో అక్కడక్కడా చిన్నచిన్న సమూహాలు, ప్రెషర్స్‌ను ఆటపట్టిస్తున్న సీనియర్స్ ఆ ప్రక్కనే కొంతమంది లాన్‌లో కూర్చున్నారు. మరికొంతమంది పాప్‌కార్న్ నములుతున్నారు. ఎవరో అరుస్తున్నారు. కాలేజీ నిండా రకరకాల విద్యార్థి సంఘాల బ్యానర్లు, ఆకట్టుకొనే నినాదాలు… కొంతమంది విద్యార్థులను కలవడానికి వచ్చిన తల్లిదండ్రులు ఉండడం మూలాన కాలేజీ వాతావరణం నిత్య నూతనంగా కళకళలాడుతున్నా… నాకెందుకో ప్రతి విద్యార్థి శిలువను మోస్తున్న క్రీస్తుల్లా ఉన్నారు. ఆ ఉద్విగ్న వాతావరణం మధ్య స్టాఫ్‌రూమ్‌కు వచ్చి కుర్చీలో కూలబడ్డాను.
నా పక్క సీటులో ఉన్న తెలుగు లెక్చరర్ యాదయ్యగారు పలకరించారు.ఏంటి సుందర్రాజు… ఏమయింది? ఎందుకు అదోలా ఉన్నారు? ఏం లేదండీ అంటూ సాయంత్రం జరిగే సెమినార్‌కు నోట్స్ రాయడానికి పేపర్సు తీశాను.అద్దాలు కనిపించలేదు ఎక్కడ పెట్టానా అని వెతుకుతుండగా… శ్యామ్ అనే విద్యార్థి, 'ఇదిగోండి మాస్టారూ!' అని చేతికిచ్చాడు. నేను క్యాంపస్‌లో స్టూడెంట్ వెల్ఫేర్ కమిటీ బాధ్యతలు చూడటం మూలాన అక్కడ చదువుతున్న ప్రతి విద్యార్థి గూర్చి కొద్దోగొప్పో తెలుసు."సార్! శ్యామ్ కూడా ఈరోజు సెమినార్‌లో పేపర్ సబ్‌మిట్ చేస్తున్నాడటగా?'' అన్నాడు యాదయ్యగారు."అవునండీ!''శ్యామ్ మంచి విద్యార్థి. సేవా కార్యక్రమాల్లో ముందుండే కుర్రాడు.కాలేజీ అడ్మిషన్ల సమయంలో హాస్టల్ ఇన్‌ఛార్జిగా ఉన్న నన్ను కలవడానికి సూట్‌కేసుకు ఏదో పాతగుడ్డ కట్టి చంకలో పెట్టుకొన్నాడు. హ్యాండిల్ విరగడం మూలాన పట్టుకోవడం ఇబ్బందిగా ఉందతనికి. పోషణ కరువైన జుట్టు, పాత చెప్పులు కాని, కళ్ళలో ఏదో సాధించాలనే తపన ఉన్నట్టనిపించింది. గుడ్డలో మూట కట్టుకొన్న సూట్‌కేస్ మరో చేతిలో ఏదో సంచి. కొద్దిపాటి సామానుతో నా గదిలోకి వచ్చాడు. అక్కడే అతని వివరాలు తెలిశాయి. అడ్మిషన్ పూర్తి అయ్యాక హాస్టల్ రూంకు వెళ్ళాడు.పాలమూరు జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతం నుండి వచ్చిన శ్యామ్ ఎవరూ లేని ఓ అనాథ. అతని తండ్రి చెప్పులు కుట్టేవాడు. అతను పుట్టగానే బహుశా నెలలవాడుగా ఉండగానే తల్లి రక్తహీనతతో చనిపోయింది. తండ్రి చాలీచాలని తిండి తింటూ కాలం అతి కష్టంగా నెట్టుకొస్తూ సక్రమంగా తిండి లేకపోవడమో, పోషణ కొరవడడమో కడుపులో పుండు అయి అతనూ చనిపోయాడు. ఆకలి, అంటరానితనం, అవమానాలు, బంధువుల ఛిత్కారాలు, అడక్కతినడాలు సంక్షేమ హాస్టళ్ళలో శరణార్థిగా బ్రతికిన అతను హాస్టళ్ళలో కేవలం బ్రతకడం కోసం మాత్రమే పురుగులు నిండిన తిండి, పంపునీళ్ళతో కడుపు నింపుకొన్నాడు. తోడూ నీడా లేకుండా చీదరింపులు, ఛీత్కారాల మధ్య యూనివర్సిటీ దాకా వచ్చాడు. చదువులో అతనికి ఉన్న శ్రద్ధ, క్రమశిక్షణ మూలంగా అతని గూర్చి ఈ కొన్ని విషయాలు తెలిశాయి. అతనికి ఉన్న ఈ నేపథ్యమే క్లాస్‌లో ఆ పాఠం చెప్తున్నప్పుడు, అతని కళ్ళలో నీళ్ళు రావడానికి కారణం అనుకొన్నాను.ఇలా ఆలోచిస్తూ మళ్ళీ నోట్సు రాసుకొనే పనిలో నిమగ్నమైనాను. ఆ మధ్యాహ్నం అన్నం తినాలనిపించలేదు. రెండుసార్లు టీ త్రాగి రాసుకుంటున్నాను.సాయంత్రం 5 గంటలు కావస్తున్నది. ఎవరికివారే హడావుడిగా తమతమ బీరువాలకు తాళాలు వేసి తిరుగు ప్రయాణం అవుతున్నారు. యాదయ్యగారు నా టేబుల్ దగ్గరకు వచ్చి,
"సుందర్ మేం బయలుదేరుతున్నాం, వస్తున్నావా? అవునూ సెమినార్ ఎక్కడ? ఎన్ని గంటలకు?'' అన్నారు."ఈరోజేనండీ సాయంత్రం ఏడున్నరకు సెంట్రల్ లైబ్రరీ సెమినార్ హాల్లో'అస్థిత్వ కులాల సాహిత్యం - సమాలోచన' వీలుంటే మీరూ రండి,''అంటూ రాసిన కాగడితాలు ఫైల్లో పెట్టుకొని బయలుదేరాను.కాలేజీ గేటు దగ్గర శ్యామ్ కనిపించాడు. "ఎలా వస్తున్నావ్?'' అడిగాను."కొంతమంది ఫ్రెండ్స్ వస్తున్నారండీ. అందరం కలిసి వస్తాం. మీరు బయలుదేరండి.''"సరేలేగాని, వీలుంటే రేపు ఆదివారం ఇంటికి రా,'' అంటూ బస్ ఎక్కాను.అంతా గందరగోళంగా ఉంది. ఎవడో వెంటబడి తరుముతున్నట్లుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుజీవుడా అన్నట్లు ఫుట్‌బోరు మీద విన్యాసాలు చేస్తున్నారు కొందరు. సెమినార్ పూర్తయ్యేసరికి చాలా లేట్ అయింది. ఆరేడుగురు ప్రముఖ కవుల, ఓ మాజీ వైస్ ఛాన్సలర్ సందేశాలతో సెమినార్ ముగిసింది. మళ్ళీ ఇంటికి ప్రయాణం.* * *......................................రాత్రి చాలాసేపుచదివాను.విక్టర్ హ్యూగో రాసిన 'ది లాస్ట్ డే ఆఫ్ ఎ కండెమ్డ్ మ్యాన్' చదివాను.ఉరిశిక్ష పడి రేపో మాపో ఉరి తీయబడే వ్యక్తి చివరి క్షణాల మానసిక విషయాలను ఉత్కంఠభరితంగా రాశారాయన.అలా చదువుతూ ఎప్పుడు నిద్రపోయానో తెలియదు.కిటికీలోంచి ఎండ ముఖం మీద పడి చురుక్కుమనడంతో మెలకువ వచ్చింది. పక్కనిండా కాగితాలు, పుస్తకాలుచిందరవందరగా పడి ఉన్నాయి. గత కొన్ని రోజులుగా రాత్రిళ్ళు ఎక్కువ మెలుకువగా ఉండటం మూలాన కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఉదయం లేవగానే టవల్ భుజం మీద వేసుకొని బ్రష్ చేసుకొంటూ బయటకు వచ్చాను. రోడ్ మీద వీధి కుళాయి దగ్గర ఆడాళ్ళు తిట్టుకొంటున్నారు. కొంతమంది ఖాళీ బిందెలతోనే వెనక్కు తిరిగారు. ముఖం కడుక్కొని ఇంట్లోకి వచ్చి కూర్చున్నాను.టి.వి. ఆన్ చేశాను. ఏదో చర్చా కార్యక్రమం జరుగుతోంది. కొంతమంది పత్రికా ఎడిటర్లు కూర్చొని ఏదో అరుస్తున్నారు. ఎవరో దీక్షితులుగారు మాట్లాడుతున్నారు. అతను పత్రికా ఎడిటర్ల స్వేచ్ఛా స్వాతంత్య్రం గురించి మాట్లాడుతున్నాడు."ఈ రోజుల్లో ఎడిటర్లకు ప్రత్యేకమైన ఎజెండా అంటూ ఏమీ లేదని…పత్రికాధిపతుల ఎజెండాలే తమ ఎజెండాలుగా భావిస్తూ చచ్చినట్లు పడి ఉంటున్నారు…''నాకెందుకో ఆ మాట్లాడుతున్నాయన మాత్రం స్వతంత్య్రంగా ఉన్నాడా అనే సందేహం కలిగింది.చర్చ రోతగా అనిపించింది. న్యూస్ పేపర్ తీసుకున్నాను. పార్టీ ఫిరాయింపులు, మిస్సింగ్ కేసులూ, నకిలీ భార్యల పాస్‌పోర్ట్ కుంభకోణాలు అన్నీ రొటీన్‌వే. అప్పుడప్పుడూ పాత్రలూ, పాత్రధారులూ మారుతుంటారు.
అప్పుడే గదిలో బెల్ బ్రోగింది.బహుశా శ్యామ్ వచ్చాడనుకున్నాను. తలుపు తీయగానే అతనే ఉన్నాడు."కమాన్ యంగ్ మాన్. హౌ ఆర్ యూ?''అంటూ ఇంట్లోకి తీసుకెళ్ళి,"కూర్చో మంచినీళ్ళు తాగుతావా?'' అని వంటగదిలోకి వెళుతూ కొన్ని లిటరరీ మ్యాగజైన్స్ ముందువేసి వెళ్ళాను. కొంతసేపటి తర్వాత రెండు కాఫీ కప్పులతో నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, 'దిగో,' అంటూ టీపాయి మీద కప్పులు పెట్టి నీళ్ళ బాటిల్ చేతికిచ్చాను.కాఫీ త్రాగుతూ టీవీలో పత్రికా స్వేచ్ఛ చర్చను చూస్తున్నాము.మధ్యలో శ్యామ్ కల్పించుకొని, "వీళ్ళ దృష్టిలో పత్రికా స్వేచ్ఛ అంటే ఏంటండీ? పత్రికాధిపతుల స్వేచ్ఛనా? పత్రికా రచయితల స్వేచ్ఛనా? ఒకర్ని అంటుకుంటే మరొకరు ఉరికి వస్తున్నారే!ఈ బహురూపులకు ఏ స్వేచ్ఛ కావాలండీ?'' అన్నాడు. అంతటితో ఆ చర్చను ఆపేశాం."సార్! మేడంగారు ఎక్కడ? పిల్లలు ఏం చదువుతున్నారండి?''"అలాంటిదేమీ లేదు. నేనింతవరకు పెళ్ళి చేసుకోలేదు.అది సరేలేగానీ చదువు ఎలా సాగుతోంది? హాస్టల్ వసతి ఎలా ఉంది?''ముక్తసరిగా జవాబు చెప్పాడు. అతని వాలకం చూస్తుంటే ఏదో పెద్ద పనిమీదే వచ్చినట్లు అనిపించింది. అతనే కొంచెం చొరవ తీసుకొని, "సార్ నాకెందుకో మీ నేపథ్యం తెలుసుకోవాలని ఉందండి.మీ గురించి చెప్పండి?'' అని అడిగాడు.అతని ప్రశ్న నాకు ఆసక్తి కలిగించకున్నా అతన్ని నిరుత్సాహపర్చడం ఇష్టంలేక మొదలుపెట్టాను.అతన్ని తలుచుకుంటే నా నలభై ఐదు సంవత్సరాల జీవితం కళ్ళ ముందు తిరుగుతుంది. కళ్ళెమ్మటి నీళ్ళు ఉబికి వస్తున్నాయి.గొంతు తడారిపోతుంది. అయినా తమాయించుకొని…"పెద్దగా చెప్పుకొనేందుకు ఏమీ లేదయ్యా… నీలాగే కష్టాలు కన్నీళ్ళు అనుభవించాను.తీవ్రమైన ఆకలిని, అంటరానితనాన్ని నా బాల్యం ఎదుర్కొన్నది.తెలంగాణలో ఓ మారుమూల గ్రామంలో బీద కుటుంబంలో పుట్టిన నా బాల్యం ఎంతో క్షోభను అనుభవించింది.దాన్ని నేను కళాత్మకంగా చెప్పలేను. పైగా నాకు పండితుల భాష రాదు.అందుకే నేను నా భాషలోనే చెప్తున్నా.నా గురించి ఏం చెప్పినా, ఏం రాసినా ఆకలి, అంటరానితనం గూర్చి మాత్రమే."అప్పటికి మా ప్రాంతంలో సాగర్ లాల్‌బహదూర్ కెనాల్ త్రవ్వలేదు. విపరీతమైన కరువుతో అల్లాడేది ఆ గ్రామం. మా ఊళ్ళో మాదిగలంతాచిన్న సన్నకారు రైతుల దగ్గర జీతానికి కుదిరేవారు. అలా పాలేరుగా పుట్టిన మా అయ్య పేరు లచ్చయ్య. అతన్ని ఊళ్ళోవాళ్ళు ఏనాడూ అలా పిలవలేదు. లచ్చిగా అనేవారు. ఆయన ఏ అంటదగిన కులంలోనో పుట్టి ఉంటే లక్ష్మయ్యగారూ అనేవారేమో. అంటరాని కులంలో పుట్టాడు కనుకే లచ్చిగాడు అయ్యాడు. ఆరుగురిలో ఆఖరివాణ్ణి నేను. అటూయిటూ కొన్ని తర్వాత తర్వాత అక్షరం ముక్క నేర్చుకుంది నేనొక్కణ్ణే. మాకు సెంటు భూమి లేదు. అమ్మా అయ్యా ఇద్దరూ కూలిపని చేసేవారు. గూడేలలో వాళ్ళంతా పెద్ద కులపోళ్ళ ఇళ్ళను భాగాలుగా పంచుకొనేవారు. వాళ్ళిళ్ళల్లో పండగలకు, పబ్బాలకు, పెళ్ళిళ్ళకూ కుటుంబం అంతా పనిచేసేవారు. వాళ్ళిళ్ళల్లో పశువులు చనిపోతే ఎత్తివేయడాలు, మనుషులు చస్తే దాన్ని తగలబెట్టి ఆ శవం బుగ్గి అయిందాకా బొగ్గు అయ్యేవారు. డై లెట్రిన్‌లో మలాన్ని చేతుల్తో ఎత్తి పోసేవారు. అలా మలినమైన పనులన్నీ మాకు పంచి ఇచ్చిన నీతి ఏ శాస్త్రంలోదో నాకర్థమయ్యేది కాదు.
"వీళ్ళు ప్రధానంగా వ్యవసాయపనుల్లోనే బ్రతుకు వెతుక్కొనేవారు. వీళ్ళ జీవితమంతా వ్యవసాయపనుల్లోనే మసిఅయ్యేది. వీళ్ళకు చివరగా దక్కేది కళ్ళం అడుగు గింజలు మాత్రమే. మా అంటే ఇంతో కొంత భిక్షంగా విదిల్చేవాళ్ళు. ఎంత కష్టపడ్డా వీళ్ళకు మిగిలేది మట్టి, తాలుతో నిండిన కొద్దిపాటి ధాన్యమే. వాళ్ళు ఏనాడూ ఆ ధాన్యపు రాశుల్లో తమకూ వాటా ఉంటుంది అని ఎందుకు కొట్లాడరో నాకస్సలే అర్థమయ్యేది కాదు.నా బాల్యం మరీ దుర్భరంగా గడిచింది. పాన్‌షాప్ బడ్డీల కింద తమలపాకులీ ఏరుకొని తిన్నరోజులు, ఊరిబయట వాగులవెంట చామగడ్డలు తొవ్వి కాల్చుకున్న రోజులు, ఊసబియ్యం తెచ్చుకొని వేపుకొని దంచుకొని తిన్న రోజులు, పశువులు కాస్తూ పరిగ ఏరిన వడ్లనుక ండువాలో పలుకురాళ్ళతో దంచి భూమిలో గుంటతీసి పూడ్చి పైన మంటపెట్టి ఉడికి ఉడకని అన్నం తిన్న రోజులు… కందికాయలు, అనపకాయలు ఊరిబయట ముళ్ళపొదల్లో రక్తం కారుతున్నా సేకరించిన ఈతకాయలు, బలుసుపండ్లు, గుబ్బకాయలు ఇవ్విటి సేకరణలోనే నా సగం బాల్యం గడిచింది. బడి వదిలాకా మేమంతా మా ఊరి బొడ్రాయి దగ్గర గుమిగూడేవాళ్ళం. ఊరిపక్క వాగుల్లో నీళ్ళకయ్యల్లో చేపలు పట్టేవాళ్ళం. చిన్నచిన్న పరకలు, రొయ్యపిల్లలు, ఉసికదంతులు, జెళ్ళలు, కనిశెలు ఇంటికి తెచ్చేవాళ్ళం. చాలా సందర్భాలలో అన్నంకు బదులు అవే మాకు తిండి. మా ఇళ్ళల్లో ఉట్టి మీద ఏనాడూ మీగడ పెరుగు లేదు. ఉంటే గింటే ఎండుతునకలు, దోసకాయ వరుగులు ఉండేవి. సెంటు భూమి లేకున్నా మాకు ఆప్యాయతలే ఆస్తులు, ప్రేమలే జీవితాలు. నిజంగా పేదవాళ్ళు గొప్ప ప్రేమికులు. ఆ ఆప్యాయతా అనురాగాలే నా గురించి చెప్పడానికి, రాయడానికి కారణమైనాయి. మా అన్నయ్య చాలా చిన్నవయస్సులోనే జీతం కుదిరాడు. అతనికి రెండు పూటలా అక్కడే తిండి. ఉదయం తనక్కడ తిని మధ్యాహ్నం తినాల్సిన సద్దిమూట స్కూల్‌లో ఇచ్చిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. నేను చవిచూసిన ఆకలి బాధ రాయాలంటే నా కలంలో ఇంకు సరిపోదేమో. నా కంట్లోంచి కారిన రక్తాన్ని ఇంకుగా మార్చి రాయాలని ఉంది శ్యామూ!"నేను ఇంతకుముందే చెప్పాను, మా ఇళ్ళలో ఎండుతునకల గూర్చి. చాలామంది మేమది తింటున్నామనే మమ్మల్ని దగ్గరకు రానియ్యలేదు. మనుషుల్ని మనుషులు చంపుకుని తింటే తప్పులేదుగాని చచ్చినవి తింటే తప్పెట్లా అవుద్ది.ఈ దేశంలో చాతుర్వర్ణం బ్రతికి ఉన్నవాళ్ళను తిన్నది. దానికి బయట ఉన్న మేము చచ్చినవాటినే తిన్నాము.వాళ్ళు కండకావరంతో చేస్తే మేం కేవలం బ్రతకడానికి మాత్రమే తిన్నాం. తప్పేమీ లేదు.నా జీవితంలో మర్చిపోలేని మరో జ్ఞాపకం, మా ఊళ్ళో పశువుల ఎండిన బొక్కలను అమ్మడం. వాటి సేకరణ చాలా కష్టంతో కూడుకొన్నది. ఎక్కడైనా పశువు చనిపోతే ఊరికి దూరంగా పారేసేవారు. మా ఇళ్ళు కూడా ఊరికి దూరంగానే ఉండేవి. చచ్చిన పశువులు చూస్తేనే భయంకరంగా ఉండేవి. విపరీతంగా కుళ్ళి వాసనొచ్చేవి. ఒక్కోసారి వర్షం వస్తే అప్పుడు విపరీతంగా ఉబ్బేవి. వాటి దగ్గరకు పోవాలంటే దుర్లభంగా ఉండేది. అంత వాసన వచ్చినా దాని మీద తెల్ల పురుగులు లక్షలాదిగా లుకలుకలాడేవి. మేమేం తక్కువ తిన్నాం అంటూ కొన్ని ఎర్ర పురుగులూ పోటీపడి బొక్కల్ని నుజ్జునుజ్జు చేసేవి.
ఈ దేశ ఆర్థికవ్యవస్థను పీల్చి పిప్పిచేస్తున్న పెట్టుబడిదారుల్లా కొన్ని దూడబాతులు, రాబందులు ఎగబడేవి. అవి ఎలా పసిగడతాయో ఏమో! పశువు చచ్చిందంటే టంచన్‌గా ప్రత్యక్షమయ్యేవి. ఎంతో సఖ్యతతో చాలా సాఫీగా ఆ పశువు మీద మాంసం పీక్కు తినేవి. మనుషుల కంటే అవే చాలా క్రమశిక్షణగా తింటాయి. రాబందులు, కుక్కలు పీక్కు తినగా మిగిలిన అస్థిపంజరాలు మాకు అవసరమయ్యేవి."అప్పట్లో ఊళ్ళల్లో వచ్చే విపరీత కరువు మూలాన ఊళ్ళో పెద్దవాళ్ళు ఉండేవారు కాదు. బ్రతుకుతెరువు కోసం గూడేలు గూడేలే కాలవ క్రిందకు వలసపోయేవాళ్ళు. కేజవలం ఊళ్ళో పిల్లలమూ, వృద్ధులమూ మిగిలేవాళ్ళం. బ్రతుకు తెరువు వెతుక్కొనే క్రమంలో తెలంగాణలో ప్రతి పల్లె ఈటుపోయిన చేనులా ఉండేది. ప్రతి గడపకు తాళాలు వెక్కిరించేవి. అలా మిగిలిన కొద్దిమంది పిల్లలం జట్లు జట్లుగా విడిపోయి, బొక్కలు సేకరించేవాళ్ళం. వాటిని చిన్నచిన్న ముక్కలుగా కట్టలు కట్టి ఇంటికి తెచ్చేవాళ్ళం. అవి తెస్తున్నప్పుడు సైకిల్ మీద కట్టిన మూట ఒక్కోసారి తెగి కిందపడేవి. వాసనతో కూడినవి మళ్ళీ కట్టాలంటే చాలా ఇబ్బందనిపించేది. కిందపడ్డ అవి అక్కడ ఎక్కువసేపు ఉంటే ఊళ్ళోవాళ్ళు తిట్టేవాళ్ళు. ఆ తొందర్లో నేననుభవించిన న్యూనతా అనుభవిస్తేనే తెలుస్తుంది. ఎండుబొక్కలు విపరీతమైన వాసన వచ్చేవి. అవికొనేవాడు ఆ వాసన అంతకాలం ఎలా అనుభవించేవాడో నాకు అర్థం అయ్యేది కాదు. సైకిల్‌పై రెండు గోనెబస్తాలు వేసుకొని ఊరూరూ తిరిగి అవి కొనేవాడు. అలా వస్తూ ఊరిబయట కాలువ దగ్గర ఆగి తెచ్చుకున్న అన్నంమూట తినేవాడు. ఆ వాసనలోనే ఆ చేతులతోనే అన్నం తిని పొద్దస్తమానం అవి సేకరించి ఫ్యాక్టరీలో అమ్మేవాడు. వాసన అని అన్నం మానలేదు కదా!"అలా వాటి సేకరణలో అరుపులు, తిట్లు, శాపనార్థాలు, కొట్లాటలు, చివాట్లు అదో గోల. వాటి సేకరణలో ఒక్కోసారి కొట్లాటలే జరిగేవి. అప్పుడప్పుడూ అవే ఆయుధాలుగా మారేవి. వాటితోనే గాయపర్చుకొనేవాళ్ళం. ఈ క్రమంలో తగిన గాయాలు, కారిన రక్తాలు జరిగిన అవమానాలు కోకొల్లలు…'',,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,* * *గదిలో ఎందుకో ఉక్కపోతగా అనిపించింది. ఇద్దరికీ బాగా చెమటలు పట్టాయి. ఏదైనా తినాలనిపించింది. ఆమధ్య ఊరి నుండి ప్రేమలత పంపిన అరిసెలు ఉన్నాయి. ప్లేట్‌లో అవి పెట్టుకొని రెండు వాటర్‌బాటిల్స్ తీసుకొని బయటికి వచ్చాము. బయట మొక్కల మధ్య తింటూ కూర్చున్నాం. ఆకాశంలో ఏదో అలజడి కన్పిస్తూనే ఉంది. వర్షం వచ్చేటట్లుంది."ఆ తర్వాత?'' అన్నాడు శ్యామ్.
"మా ఊరికి దగ్గరలోనే ఓ బొక్కల మిల్లు ఉండేది. ఇప్పుడది లేదు. ఓ వామపక్ష పార్టీ నాయకుడిది అది. కేవలం బ్రతుకుదెరువు కోసం మా తెలంగాణ జిల్లాలలోకి సంచి భుజాన వేసుకొని వచ్చిన వేలాదిమందిలో అతనూ ఒకడు. కులం కారణంగానో, పార్టీ పలుకుబడి కారణంగానో అతి సామాన్యమైన అతను నేడు కోట్ల రూపాయలు సంపాదించాడు. వాటితో బాటే విస్తృతమైన పలుకుబడి, దాంతో విలువైన అపార్టుమెంట్లు, విదేశీ కార్లు సంపాదించాడు. మా తెలంగాణలో ఇలాంటివాళ్ళు ఎంతోమంది ఉంటే ఉండవచ్చు. వాళ్ళు నేడు మా అజ్ఞానం ఆకాశం అంత అనీ, వాళ్ళకు నోళ్ళు లేకపోయినా నోట్లో నాలుకలు ఉన్నాయని అంటున్నారు. ఇలాంటి కోటీశ్వరులు ఏ బూర్జువా పార్టీలోనే ఉంటే పోనీలే అనుకొనేవాళ్ళం. వ్యక్తిగత ఆస్తి ఉన్న ఆయన కమ్యూనిస్టు పార్టీ పాఠాలు చెప్తాడు. అతని ఫ్యాక్టరీకే ఈ బొక్కల సేకరణ చేసేవాళ్ళం. అలా సేకరించిన మా బొక్కలు బొందల పాలయినాయి కానీ అతను మాత్రం కోటీశ్వరుడు అయ్యాడు.కొంతకాలానికి తెలంగాణ పల్లెలు తొండల గుడ్లకి స్థావరాలైనాయి. అప్పుడు గొడ్లు సహజంగా చావడం కంటే కబేళాలకు బలవన్మరణాలతో తరలించబడ్డాయి. తినడానికి తిండి లేని రైతు అవసరమైతే తాళిపుస్తెలు తాకట్టుపెట్టి కొన్న పురుగుమందులతో, తెచ్చిన కష్టాల నష్టాల మూలంగా అవే త్రాగి ఉసురు తీసుకొన్న రైతులు మాత్రం ఎంతకాలం ఆ భారం మోయగలరు. 'ద ప్లష్ వాజ్ హెమీ ఆన్ దెయిర్ బ్యాక్.'వాళ్ళకు కట్టుగొడ్లు గుదిబండలుగా మారాయి. మందలు మందలుగా లారీలకు లారీలు పట్టణాలలోని కటిక దుకాణాలకు కళ్ళనీళ్ళు ఉబికి వస్తుండగా అమ్మివేశారు. ఈ దేశంలో రైతుగా పుట్టడమే శాపమయింది. ఆ శాపగ్రస్తులు కట్టుగొయ్యలతో సహా అమ్మివేసి నిస్సహాయులుగా మిగిలిపోయారు. కేవలం పశువులు మాత్రమే కాదు ఇక్కడ మనుషుల అసహజ మరణాలు మాకు సర్వసాధారణమే. స్మారక స్థూపాలు చెప్తాయ్ ఎంతమంది పోయారో."మా ఊళ్ళో అప్పుడు బొక్కల కరువువ చ్చింది. అప్పటిదాకా చచ్చిన కళేబరాల కోసం వెతుకులాడిన మా చూపులు స్మశానం వైపు మళ్ళాయి. మనుష్యుల బొందలు త్రవ్వే పనికి సాహసించాం. అలా రాత్రిళ్ళు స్మశానంలోనే ఎక్కువ కాలం గడిపాం. శవాన్ని తగలెయ్యగా మిగిలిన మొద్దులు రాత్రి వీచే గాలులకు ఎర్రగా కణకణలాడుతున్నట్లుగా కనిపించేవి. భయంభయంగా ఉండేవి. అవి చూస్తే చిన్నప్పుడు స్మశానంలో కొరివిదయ్యాలు తిరుగుతాయి అని విన్న కథలు మరింతగా భయపెట్టేవి. ఇవేవి ఆకలి ముందు అంత సమస్యగా అనిపించేవి కావు. పైసల కోసం, ఆకలి కోసం, బొక్కల కోసం బొందలు తవ్వాం. తిరిగాం తిరిగాం ఎన్నో బొందలు మాయమైపోతున్నాయి కాని మా వెతుకులాట మాత్రం ఆపలేదు. చాలాకాలానికి బొక్కల సైజు తగ్గడం చూసి వాటిని కొనే వ్యక్తి మమ్మల్ని నిలేశాడు. విషయం ఊరంతా తెలిసింది. పెద్ద పంచాయతే జరిగింది. మా నోటికాడ సకల సంపదల్ని కొల్లగొడుతున్న రాబందులు మమ్మల్ని ఈ విషయంలో దొంగలన్నారు. తిట్టారు, కొటాజ్టిరు. అలగా లంజాకొడుకుల్ని ఊరు నుండి వెలివేయండి అన్నారు. ఊరికి అరిష్టం జరిగింది శాంతి జరపాలన్నారు.
నిజంగా దొంగలెవరో నాకిప్పటికీ అర్థం కాదు.''బయట ఎవరో పిలుస్తున్నట్లనిపించింది. ఇద్దరం అటు తిరిగాం.సుందర్ సార్, "ఏదో పార్శిల్ అండీ, నల్గొండ నుండి,'' అన్నాడు. బహుశా పుస్తకాలు అయి ఉంటాయి. ఫ్రమ్ అడ్రస్ చూశా. వేముల ఎల్లయ్య 'సిద్ధి' పంపాడు. పార్శిల్ పక్కనపెట్టాను."స్కూల్‌కి వెళుతున్న నన్ను వంటి మీద బట్టల సమస్య విపరీతంగా ఇబ్బంది పెట్టేది. అమ్మ పాతచీరలే మాకు పక్కకూ, కప్పుకోవడానికి. నా చిన్నప్పటి నుండి మావి చింకిపాతలే. మా ఇంటి ప్రక్కనే బయిండ్ల వీరస్వామి ఉండేవాడు. ఊళ్ళో ముత్యాలమ్మ, మైసమ్మ లాంటి గ్రామదేవతల దగ్గర ఓ రకంగా సేవ చేసేవాడు. పక్క ఊర్లో ఉన్న కొంతమంది తండాల నుండి వచ్చి బాణామతి చిల్లంగిలాంటివి అతను తొలగిస్తాడని అతని వద్ద పూజలు చేయించుకొనేవాళ్ళు. అర్ధరాత్రి వేళ అరుపులు, మంత్రాలుచదివేవాడు. అతనితో మమ్మల్నెవరినీ మాట్లాడనిచ్చేవారు కాదు. ఓ రోజు నేను స్మశానంలో తిరుగుతున్నప్పుడు శవదహనానికి ముందు దాని మీద కప్పిన తెల్లగుడ్డను ఓ కర్రతో పక్కకు విసిరేశాడు. దానివంక అందరూ భయంభయంగా చూసేవారు. ఆ గుడ్డను వీరస్వామి ఇంటికి తెచ్చుకోవడం నేను చూశాను. ఓరోజు ధైర్యం చేసి ఇంటికి వెళ్ళాను.గడప దగ్గర నిమ్మకాయలు, తాయత్తులు కనిపించాయి. భయం వేసింది. ధైర్యం చేసుకొని, "పెద్దయ్యా నాకో తెల్లగుడ్డ కావాలి ఇస్తావా?''"ఎందుకు రా?'' అడిగాడు."చొక్కా కుట్టించుకుంటా!''"అలా అతనిచ్చిన ఆ తెల్లగుడ్డతో రెండు చొక్కాలు కుట్టించుకున్నాను. ఎన్నోసార్లు అవే చొక్కాలు వేసుకున్నాను. ఈ సంఘటన నన్ను కొన్ని విషయాల పట్ల ధైర్యంగా మాట్లాడేటట్లు చేశాయి. అప్పటినుండే నాలో హేతువాద భావాలు అలవడ్డాయి. హేతువాద ప్రచారకుడ్ని చేశాయి.హైస్కూలు తర్వాత చదువులో కొంచెం చురుకైన నన్ను మా టీచర్ ఆశాదేవిగారు చేరదీశారు.వారు నన్ను వాళ్ళింట్లోనే అట్టిపెట్టుకొని చదువుకొనే ఏర్పాటు చేశారు. ఎంతో నిష్టగల శ్రీవైష్ణవుల కుటుంబం అది. ఆ ఇంట్లో నేను ఉండడానికి మా మేడం పెద్ద యుద్ధమే చేశారు. వాళ్ళను ఒప్పించి నాకు తిండిపెట్టి చదువు చెప్పించారు.భద్రాచలం దేవాలయంలో ఇప్పటికీ వాళ్ళ కుటుంబమే ప్రధాన అర్చకత్వం చేస్తున్నారు. అలా శ్రీవైష్ణవుల ఇంట్లో పనిమనిషిగా మారి చదువుకున్న నేను అనేక ఒడిదుడుకుల మధ్య యూనివర్సిటీ దాకా ఎదిగాను.''ఇలా నా విషయాలు శ్యామ్‌తో పంచుకోవడానికి ప్రధాన కారణం ఇద్దరి బాధలూ భావాలూ ఒక్కటి కావడమే… నా కాలంలో నా పట్ల వివక్ష చూపినా, నేటి నాగరికత ఎంతో అభివృద్ధిచెందినది. ఎక్కడికో వెళ్ళాం అంటున్న ఈ వ్యవస్థ ఈనాడు కూడా శ్యామ్ పట్లా అదే వైఖరి కలిగి ఉంది.
రెండు తరాలకు ప్రతీకలైన మాపట్ల ఎందుకు ఈ వ్యవస్థ కటువుగా ఉంది?గడిచిన ఈ అర్ధ శతాబ్దంలో ఏమీ ఎందుకు మారలేదు? ఎంతో మారింది అంటున్నారే ఈ దేశ మేధావులు. వీళ్ళు అంతా వృద్ధిరేటు పెరిగిందీ పెరిగిందీ అంటున్నారు.ఏం పెరిగిందీ?స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల అనే డొల్ల పదాలతో మోసం చేస్తున్నారు.మనలాంటి పేదలు ఎంత మగ్గినా జి.డి.పి. పెరుగుదల నమోదు చేయవచ్చు. కేవలం గణాంకాలు మాత్రమే పెరుగుతాయి. ఎక్కడ ఉన్నది అక్కడే ఉంది'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''.ఆకలి అవుతోంది. ఇంట్లోకి పోదాం పద ఏమైనా వండుకుందాం అంటూ కిచెన్‌లోకి వెళ్ళాం. లైట్ వేశాను. కుక్కర్‌లో రైస్ వేసి ఆ ప్యాకెట్ విప్పాను. అప్పుడు గుర్తుకు వచ్చింది తను తప్పని పరిస్థితిలో ఈమధ్య ఇంటికి వెళ్ళాను. చిన్ననాటి మిత్రురాలు యూనివర్సిటీలో నా జూనియర్ అయిన ప్రేమలత తన కూతురుకు అన్నం ముట్టియ్యాలి, అదీ నాచేత జరపాలని పట్టుపట్టింది. ఆ పద్ధతులు నాకు ఇష్టం లేకున్నా తప్పలేదు వెళ్ళాలనిపించింది. వాళ్ళను చూసినట్లు ఉంటుందని వెళ్ళాను.వెళుతూ ఆమెకిష్టమైన పూర్ణాలు కొని తీసుకెళ్ళాను. భోజనాల తర్వాత ఇంటికి బయలుదేరుతుండగా, 'వన్‌మినిట్!' అంటూ నీట్‌గా ప్యాక్ చేసిన కవర్ ఇస్తూ,"నీకిష్టంగా సుందర్ ఇవి తీసుకెళ్ళు…' అంది నవ్వుతూ, వట్టి తునకలు ఇస్తూ.మాట్లాడుతూనే ఆ ప్యాకెట్ తీసి ఆ పూట వండాను.భోజనాల తర్వాత చివరగా అంతకు ముందురోజు సెమినార్‌లో శ్యామ్ ప్రెజెంట్ చేసిన పేపర్,'అస్తిత్వ కులాల ఉద్యమాలు-సాహిత్య ధోరణులు' మీదకు మళ్ళింది చర్చ. అతను కేవలం అకడమిక్ పుస్తకాలను మాత్రమే చదివినట్లు నాకనిపించలేదు. కొద్దోగొప్పో అదనంగా కూడా చదివాడు.ఒక్కసారిగా ఆకాశంలో ఏదో మార్పు కలిగింది. సన్నటి చినుకులు మొదలయ్యాయి. గాలి బలంగా వీస్తోంది. ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. కరెంటు పోయింది. ఇంట్లో రీడింగ్ రూమ్‌లోకి తీసుకెళ్ళాను. గ్లాస్ కిటికీలకు అడ్డంగా ఉన్న కర్టెన్‌లను పూర్తిగా తొలగించాను. గదిలో వెలుతురు కొంచెం పెరిగింది.
మా ఇద్దరి చర్చ కులం అనే అంశం మీదకు పోయింది. కులసమస్య పట్ల ఇంతకాలం ఒంటిచేతి చప్పట్లతోనే ఉద్యమాలు నడుపుతున్నారు.ఇక్కడ కులం కేవలం ఒక భావన మాత్రమే. వర్గాలు మాత్రమే ఉన్నాయి అంటున్నారు ఈ దేశ బుద్ధిజీవులు."సార్ ఒకటి మాత్రం నిజం. ఈ దేశంలో శవానికీ, స్మశానానికీ అన్నింటికీ కులం ఉంది. అంతెందుకు కుల ఆచ్ఛాదన లేని గుండుసూది మొన పట్టినంత స్థలాన్ని చూపించమనండి ఈ దేశ బుద్ధిజీవులను. అలగాజనాల కళలకూ భావాలకూ తీరని ద్రోహం జరిగింది. ఇంతకాలం పండిత వర్గాలు అలగాజనాల కళలనూ సాహిత్యాన్నీ తృణీకరించాయి. వాళ్ళు చెప్పిందే కళ అయింది. సాహిత్యం అయింది. అందుకేనండీ మన కళలకూ, భావాలకూ ఏ గ్రంథాలు చోటివ్వలేదు. గ్రంథస్తం చేయలేదు. ఆధిపత్య కులాల కళలకూ, అలగాజనాల కళలకూ పెద్ద అగాధం సృష్టించారు. ఆ అగాథాన్ని పూడ్చి ఓ ప్రత్యామ్నాయ సంస్కృతినీ, సాహిత్యాన్నీ సృష్టించాల్సిన అవసరం చాలా ఉంది. అది ఎంతైనా అవసరం. ఇంతకాలం మనపట్ల ఎంతో వివక్ష చూపారు. చాలామంది మేధావులు చక్రవర్తి ఫారో శవం ముందు కిరాయి దుఃఖితులుగా దొంగేడ్పులు ఏడ్చారు. మనం ఇలాగే ఉంటే ఆ ఏడ్పులతో మనల్ని మభ్యపెడుతూనే ఉంటారండీ. మనం ఇలాగే ఉంటే మనల్ని భూస్థాపితం చేసి మరీ ఆనందంగా ధైర్యంగా నవ్వుతారు. ఎవడి అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని వాడే రాసుకోవాలి. అస్థిత్వ ఉద్యమాల ఆత్మ గౌరవాన్ని పరిపుష్టం చేయడానికి సరిపడా గింజలు తయారుచేశాం. వాటిని నలుమూలలా చల్లుతాం. ఇంతకాలం కేవలం ఆధిపత్యాల కోసం మాత్రమే జరిగిన ఈ అబద్ధ యుద్ధాల సిలబస్‌ను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఒంటి చేటతి చప్పట్ల దిశను దశనూ మారుస్తాం!"సార్! మనం కొన్ని వేల సంవత్సరాలుగా పరాజితులుగానే ఉన్నాం. ఓడిపోతూ వంచింపబడుతూనే ఉన్నాం. ఎంతకాలం ఇలా… ఇంతకాలం విజేతలే చరిత్రను నిర్మించారు.ఆ పరాజితులే చరిత్ర నిర్మాతలైతే ఎలా ఉంటుందో…ఇంత కాలం బ్రతకడమే ఓడిపోవడమయినప్పుడు బరితెగించి యుద్ధమే చేయాలండీ!ఏమో ఈ యుద్ధంలో మనమే గెలుస్తామేమో…''శ్యామ్ ఈ మాటలన్నాక కాసేపు మౌనంగా ఉండిపోయాను.ఆ నిశ్శబ్దం నాకు చిత్రంగాకనిపించింది. శ్యామ్‌ని తీక్షణంగా చూశాను.ఎముకలు పిగులుతున్న చప్పుడు…......................కథలు 8 అభిప్రాయాలు # gs rammohan 08 ఆగస్టు 2007 , 8:36 am Moving tale. Simple in style yet powerful and penetrating narration. # vrdarla 09 ఆగస్టు 2007 , 11:54 pm మాదిగ జీవితం లో వర్ణించని కోణాలను ఈ కథలో వర్ణించారు కథకుడు. ఎముకలు అమ్ముకుంటూ భోజనం చేసే టప్పుడు చేసిన వర్ణన మాదిగల దయనీయ స్థితిని కళ్ళకు కట్టినట్లు అనిపించింది.శిల్ప పరంగా కొంత పరిణతిని సాధించ వలసినా, విషయం బలంగా ఉంది. కమ్యూనిజం లో వ్యక్తి గత ఆస్తుల పట్ల రచయిత దృష్టిని కేంద్రీకరించడం బాగుంది.
# PRAJAKALA.ORG » Blog Archive » ఇతర రచనలు: 24 ఆగస్టు 2007 , 12:35 pm […] కథ: కొన్ని ఎముకలు… ఇంకొన్ని గింజలు - గుర్రం సీతారాములు […] # saiduluinala 27 ఆగస్టు 2007 , 5:39 am ఈ కథ మాదిగ జీవితాలను ప్తిబింబించింది.రచయ్త కు దన్యవాద్ములు…ఐనాల # khaja 29 ఆగస్టు 2007 , 6:03 am కథ చాలా బాగుంది. తీసుకున్న అంశం, రాసిన తీరు బాగుంది.రచయితకు అభినందనలు! # ramadas 17 అక్టోబర్ 2007 , 11:35 am మి కథ చాలా భాగుంది.మరీ చెప్పాలంటె ప్రతి ఒక్క దళిత కుటుంభాలలొ అనివార్యంగా వున్నటువంటి సంఘటనలు మీ కథ లొ కన్పించాయి.ఐనాల.రామదాసుసిరిపురం,ఖమ్మం,జి. # gorla 25 అక్టోబర్ 2007 , 4:16 am కులమె మన లను చ0పి0చిది అన్న కథ బాగా రాషావు కుల వర్గ పొరాత0 చెయ్యాఐ # nirmala 02 ఏప్రిల్ 2008 , 10:32 am కధ నిరంతరం వెంటాడేలా వుంది.ఇలాంటి కధలు ఇప్పటి నేపధ్యంలో చాలా అవసరం. చిత్రీకరణల వెనుక వక్రీకరణలు -పసునూరి రవీందర్‌ బాబి, ramesh [...] "గొర్లను తినెటోడు పోతె బర్లను తినెటోడచ్చిండు" Rallavagu, anonymous [...] తెలుగు సాహిత్యం - మాదిగ జీవిత ప్రతిఫలనం Darla VenkateswaraRao, P. Ramanarasimham [...] 'భూమితో మాట్లాడిన' నవల P.ANAND KUMAR, Surya Rao K జనస్వామ్య భౌగోళిక - తెలంగాణా స్వప్నం mohan, ramulu [...]